Sunday, November 16, 2025
Homeఇంటర్నేషనల్Operation Sindoor : గాల్లోనే కూలిన 5 పాక్ యుద్ధ విమానాలు... దాయాది దేశం...

Operation Sindoor : గాల్లోనే కూలిన 5 పాక్ యుద్ధ విమానాలు… దాయాది దేశం స్పందన!

Indian Air Force Operation Sindoor : భారత సైనిక చరిత్రలో మరో కీలక అధ్యాయమైన “ఆపరేషన్ సిందూర్”కు సంబంధించి అత్యంత కీలకమైన, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఏకంగా ఐదు యుద్ధ విమానాలను భారత వాయుసేన గాల్లోనే కూల్చివేసిందని వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్‌ సింగ్‌ (ఏపీ సింగ్) తొలిసారి అధికారికంగా ప్రకటించారు. కేవలం 90 గంటల్లోనే పాకిస్థాన్‌ను కాళ్ల బేరానికి వచ్చేలా చేసిన ఈ “హై-టెక్ యుద్ధం” ఎలా సాగింది..? భారత రక్షణ కవచం ‘ఎస్-400’ పోషించిన పాత్రేంటి..? ఈ విజయం వెనుక ఉన్న వ్యూహాత్మక రహస్యాలేంటి..?

- Advertisement -

గగనతలంలో భారత ప్రతాపం: బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ చేసిన ఈ ప్రకటన, ఆపరేషన్ సిందూర్ యొక్క తీవ్రతను, భారత వాయుసేన పాటించిన కచ్చితత్వాన్ని కళ్లకు కట్టింది. ఈ ఆపరేషన్ కేవలం ప్రతీకార చర్యే కాదు, అదొక పక్కా ప్రణాళికతో కూడిన ఆధునిక యుద్ధమని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి.

తొలిసారి అధికారిక ప్రకటన: 5+1 కూల్చివేత :ఇప్పటివరకు ఊహాగానాలకే పరిమితమైన పాక్ నష్టంపై, వాయుసేన చీఫ్ తొలిసారి స్పష్టతనిచ్చారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ వైమానిక దళానికి భారీ నష్టం వాటిల్లినట్లు భారత ప్రభుత్వం మొదటిసారిగా అధికారికంగా ధ్రువీకరించింది. ఈ ఆపరేషన్‌లో పాక్‌కు చెందిన కనీసం ఐదు యుద్ధ విమానాలను, ఒక భారీ విమానాన్ని కూల్చివేశామని ఏపీ సింగ్ నిక్కచ్చిగా ప్రకటించారు. దీంతో పాకిస్తాన్ సైన్యానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు ఆయన వెల్లడించారు.

90 గంటల హై-టెక్ యుద్ధం… పాక్ దిగివచ్చిందిలా  :ఈ ఆపరేషన్ ఎంత వేగంగా, ప్రభావవంతంగా సాగిందో ఏపీ సింగ్ వివరించారు. “ఇది ఒక హై-టెక్ యుద్ధం. కేవలం 80 నుంచి 90 గంటల్లోనే మా లక్ష్యాలలో చాలా వరకు సాధించాం. యుద్ధం ఇలాగే కొనసాగితే భారీ మూల్యం తప్పదని వారికి (పాకిస్థాన్‌కు) స్పష్టంగా అర్థమైంది. అందుకే వారే కాళ్ల బేరానికి వచ్చి, చర్చలు జరుపుదామని సందేశం పంపారు,” అని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇది భారత సైనిక మరియు వ్యూహాత్మక ఆధిపత్యాన్ని చాటుతోంది.

గేమ్ ఛేంజర్ ‘ఎస్-400’ రక్షణ కవచం : ఈ ఆపరేషన్‌లో భారత గగనతల రక్షణ వ్యవస్థల పాత్ర, ముఖ్యంగా రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 క్షిపణి వ్యవస్థ పనితీరును ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. “మా వైమానిక కేంద్రాలపై దాడి చేయాలని పాక్ యుద్ధ విమానాలు ప్రయత్నించాయి. ఈ సమయంలో ఇటీవల మనం సమకూర్చుకున్న ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ ఒక ‘గేమ్ ఛేంజర్’‌లా పనిచేసింది. ఈ వ్యవస్థ పన్నిన పటిష్టమైన రక్షణ వలయం వల్లే శత్రు విమానాలు మన దరిదాపులకు కూడా రాలేకపోయాయి,” అని ఏపీ సింగ్ వివరించారు.

దెబ్బతిన్న షహబాజ్‌ ఎయిర్‌ఫీల్డ్‌ :భారత దాడుల్లో లక్షిత ప్రాంతాలలో ఒకటిగా ఉన్న పాకిస్థాన్‌లోని షహబాజ్‌ జకోబాబాద్‌ వైమానిక స్థావరానికి జరిగిన నష్టాన్ని కూడా ఆయన ధ్రువీకరించారు. “మేము దాడి చేసిన ప్రధాన ఎయిర్‌ఫీల్డ్‌లలో షహబాజ్‌ ఒకటి. అక్కడున్న ఎఫ్‌-16 హ్యాంగర్‌ సగానికి పైగా ధ్వంసమైంది. అందులో ఉన్న యుద్ధ విమానాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని మా అంచనా,” అని తెలిపారు.

వాయుసేన చీఫ్ అమర్‌ప్రీత్‌ సింగ్‌ చేసిన ఈ ప్రకటన, “ఆపరేషన్ సిందూర్” అనేది కేవలం ఉగ్రవాద శిబిరాలపై దాడి మాత్రమే కాదని, అది పాకిస్థాన్ యొక్క సైనిక అహంకారాన్ని దెబ్బతీసిన ఒక సంపూర్ణ సైనిక విజయమని స్పష్టం చేస్తోంది. ఎస్-400 వంటి ఆధునిక రక్షణ వ్యవస్థల సమర్థత, భారత వాయుసేన ప్రణాళికాబద్ధమైన దాడి సామర్థ్యం ఈ ఆపరేషన్‌తో మరోసారి రుజువైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad