Kim Jong Un: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఎట్టకేలకు దేశం దాటారు. మంగళవారం ఆయన చైనాలో అడుగుపెట్టారు. బీజింగ్ నిర్వహించనున్న సైనిక కవాతులో ఆయన పాల్గొననున్నారు. ఇందుకోసం ఆయన బుల్లెట్ ప్రూఫ్ రైలులో డ్రాగన్ కంట్రీకి వెళ్లారు. సోమవారం రాత్రి ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి ఆయన బయల్దేరినట్లు ఆ దేశ విదేశాంగశాఖ వెల్లడించింది. ఆయన వెంట విదేశాంగ మంత్రి చో సోన్ హుయ్, ఇతర అధికారులు ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఆ రైలు బీజింగ్కు చేరుకోనుంది. 2023 తర్వాత మళ్లీ కిమ్ దేశం దాటడం ఇదే తొలిసారి. 2023లో కిమ్ (Kim Jong Un) రష్యా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, 2019లో ఆయన చైనా (China)కు వచ్చారు. అమెరికా, దాని మిత్ర దేశాలు ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఉత్తర కొరియాకు చైనా నుంచి పూర్తి మద్దతు అందుతోంది. అందుకే ఆ దేశం యూఎస్ ఒత్తిడిని తట్టుకొని, అణు బెదిరింపులు చేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్తో యుద్ధం చేస్తోన్న రష్యాకు తన సైనికులను పంపుతోంది. ఇలా రెండు దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఇప్పుడు ఈ ముగ్గురు ఒక వేదిక వద్ద కనిపించడం వారి మధ్య బలపడుతోన్న బంధానికి నిదర్శనంగా మారనుంది. అమెరికా ప్రాబల్యానికి సవాల్ విసరడమే ఈ మైత్రి లక్ష్యమని, మరోవైపు.. కిమ్ ఇద్దరు అగ్రనేతలతో కనిపించడం ఉత్తరకొరియా దౌత్యపరమైన స్థితిని పెంచుతుందని నిపుణులు అంటున్నారు.
Read Also: ODI: ఒక్కసారి కూడా డకౌట్ కానీ టీమిండియా ప్లేయర్ ఎవరంటే?
సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
మరోవైపు, కిమ్ పర్యటన వేళ ఉత్తర కొరియాకు, చైనాకు మధ్య ఉన్న సరిహద్దు దగ్గర భద్రతను కట్టుదిట్టం చేసినట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాకుండా, చైనా పర్యటనకు ముందు కిమ్ జోంగ్ ఉన్ ఒక కొత్త ఆయుధ కర్మాగారాన్ని సందర్శించారని సమాచారం. చైనా సరిహద్దు సమీపంలో ఉన్న జగాంగ్ రాష్ట్రంలో ఈ పరిశ్రమ ఉండవచ్చని భావిస్తున్నారు. ఇకపోతే, కిమ్ పర్యటిస్తున్న లగ్జరీ బుల్లెట్ ప్రూఫ్ రైలునే ఆయనతో పాటు ఆయన తాత, తండ్రి కూడా విదేశీ పర్యటనలకు వాడారు. ఈ రైలు కేవలం గంటకు 50 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. ఎందుకంటే దీనికి భారీగా సాయుధ కవచాలు అమర్చి ఉండటంతో ఆ బరువుకు వేగంగా వెళ్లలేదు. ఈ రైలుకు భారీగా సాయుధ దళాల రక్షణ ఉంటుంది. వీరు ముందు స్టేషన్లు, మార్గాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంటారు. ఈ రైలులో రష్యన్, చైనీస్, కొరియన్, జపనీస్, ఫ్రెంచి వంటకాలను సిద్ధంగా ఉంచుతారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రెడ్ వైన్లు కూడా దీనిలో అందుబాటులో ఉంటాయి. పుతిన్ ప్రైవేటు రైల్లో కూడా ఇన్ని సౌకర్యాలు ఉండవు. నార్త్ కొరియా పాలకుల రైల్లో దాదాపు 90 కోచ్లు ఉంటాయి. కాన్ఫరెన్స్ రూమ్, ఆడియన్స్ ఛాంబర్, బెడ్రూమ్స్, శాటిలైట్ ఫోన్స్, ఫ్లాట్ స్క్రీన్ టెలివిజన్లు ఉంటాయని దక్షిణ కొరియా పత్రిక 2009లో కథనం వెలువరించింది. ఇకపోతే, నార్త్ కొరియా ఎయిర్లైన్స్కు అత్యంత దారుణమైన రేటింగ్ ఉండటంతో నేతలంతా ఈ రైలు పైనే ఆధారపడ్డారు. 2018లో సింగపూర్లో తొలిసారి ట్రంప్ను కలిసినప్పుడు చైనా అందించిన బోయింగ్ 747 విమానాన్ని కిమ్ ఉపయోగించారు.
Read Also: Israel: బాడీగార్డ్ నిర్లక్ష్యం వల్ల ఇరాన్ కు ఎదురుదెబ్బ..!


