Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్India S-400 Deal : భారత గగనతలంలో 'బ్రహ్మాస్త్రం'.. దేశం నలుమూలలా S-400 మోహరింపునకు రంగం...

India S-400 Deal : భారత గగనతలంలో ‘బ్రహ్మాస్త్రం’.. దేశం నలుమూలలా S-400 మోహరింపునకు రంగం సిద్ధం!

India-Russia S-400 missile deal : భారత అమ్ములపొదిలోని బ్రహ్మాస్త్రం.. గగనతలంలో అభేద్యమైన రక్షణ కవచం.. అదే S-400 ‘ట్రయంఫ్’ వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్థాన్ దుస్సాహసాన్ని సమర్థంగా తిప్పికొట్టి, శత్రువులకు సింహస్వప్నంగా నిలిచిన ఈ వ్యవస్థ గురించి ఇప్పుడు మరో కీలక సమాచారం బయటకు వచ్చింది. ఇప్పటికే మూడు స్క్వాడ్రన్లను కీలక సరిహద్దుల్లో మోహరించిన భారత్, ఇప్పుడు దేశంలోని నలుమూలలా ఈ రక్షణ కవచాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతోంది. మరిన్ని S-400 వ్యవస్థల కోసం రష్యాతో భారత్ చర్చలు జరుపుతోందన్న వార్త, మన సరిహద్దుల భద్రతపై కొత్త భరోసాను నింపుతోంది.

- Advertisement -

రష్యా ధ్రువీకరణ.. చర్చల దశలో ఒప్పందం: భారత్‌కు అదనపు S-400 వాయు రక్షణ వ్యవస్థలను సరఫరా చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయని రష్యా ప్రభుత్వ రంగ వార్తా సంస్థ ‘TASS’ వెల్లడించింది. రష్యా రక్షణ ఎగుమతి సేవల అధిపతి డిమిత్రి షుగేవ్‌ ఈ విషయాన్ని ధృవీకరించినట్లుగా ఆ కథనంలో పేర్కొంది. ఇప్పటికే భారత్ మొదటి విడతగా ఈ అధునాతన వ్యవస్థలను అందుకుంది. 

అధికారి ప్రకటన: “భారతదేశానికి అదనపు S-400 వ్యవస్థల సరఫరాపై చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో మరింత సహకారాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన చర్చల దశలో ఉంది,” అని షుగేవ్ పేర్కొన్నట్లు TASS వెల్లడించింది.

రాయిటర్స్ కథనం: అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ కూడా ఈ వార్తను ధ్రువీకరించింది. ‘ఆపరేషన్ సిందూర్’ అనే కీలక సైనిక విన్యాసాల సమయంలో S-400 వాయు రక్షణ వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉందని భారత్ సంతృప్తి వ్యక్తం చేసిందని రాయిటర్స్ పేర్కొంది

ఎందుకీ అవసరం – ఎక్కడ మోహరించారు  : చైనా, పాకిస్థాన్‌ల నుంచి ఏకకాలంలో పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి S-400 వ్యవస్థను భారత్ అత్యంత కీలకమైనదిగా భావిస్తోంది.

2018లో ఒప్పందం: 2018లో రష్యాతో భారత్ 5.5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఐదు S-400 స్క్వాడ్రన్లను రష్యా మనకు అందించాలి.
ఇప్పటికే మూడు మోహరింపు: ఇప్పటికే అందిన మూడు స్క్వాడ్రన్లను పంజాబ్ (పాకిస్థాన్ సరిహద్దు), లఢఖ్, సిలిగురి కారిడార్ (చైనా సరిహద్దు) వంటి అత్యంత వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించారు.

మిగిలినవి త్వరలో: నాలుగో స్క్వాడ్రన్ 2025 చివరి నాటికి, ఐదోది 2026లో అందనుంది.

కొత్త బ్యాచ్ వస్తే.. దేశవ్యాప్త మోహరింపు: ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ఫలించి, కొత్త బ్యాచ్ S-400 వ్యవస్థలకు ఒప్పందం కుదిరితే, వాటిని దేశంలోని ఇతర కీలక ప్రాంతాలు, తీరప్రాంతాల్లో మోహరించి, భారత గగనతలాన్ని పూర్తిస్థాయిలో శత్రుదుర్భేద్యంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది.

భారత్-రష్యా చెరగని బంధం: అమెరికా ఆంక్షల హెచ్చరికలను కూడా లెక్కచేయకుండా భారత్, రష్యాతో తన వ్యూహాత్మక రక్షణ బంధాన్ని కొనసాగిస్తోంది. దీనికి నిదర్శనంగా ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య జరిగిన భేటీని పేర్కొనవచ్చు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు కష్టకాలంలో ఒకరికొకరు అండగా ఉంటామని పునరుద్ఘాటించారు. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) నివేదిక ప్రకారం, 2020-24 మధ్య కాలంలో భారత్ ఆయుధ దిగుమతుల్లో 36 శాతం వాటాతో రష్యా అగ్రస్థానంలో ఉంది

S-400 ప్రత్యేకత: 400 కిలోమీటర్ల పరిధిలో శత్రువుల యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లను ఏకకాలంలో గుర్తించి, నాశనం చేయగల సత్తా S-400 సొంతం. అమెరికాకు చెందిన అత్యాధునిక F-35, F-16 యుద్ధ విమానాలు కూడా దీని ముందు నిలవలేవని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad