India-UK: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీకి యూకేలో ఘన స్వాగతం లభించింది. లండన్ నగరంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్ సమక్షంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్-బ్రిటన్ మధ్య ఉన్న ఆర్థిక బంధాలు బలపడేలా రెండు దేశాల వాణిజ్య శాఖ మంత్రులు పీయూష్ గోయల్, జోనథన్ రేనోల్డ్స్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసారు.
ఈ ఒప్పందం ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 34 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనా.. అంటే 2030 నాటికి 120 బిలియన్ డాలర్లకు పెంచాలన్న లక్ష్యంతో ఇరుదేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనితో పాటు ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అవుతాయి. ఈ ఒప్పందంతో గ్లోబల్ వాణిజ్య రంగంలో భారత్ స్థానం మరింత పటిష్టం కానుంది.
అనంతరం ప్రధాన మంత్రి మోదీ మాట్లాడుతూ భారత్- బ్రిటన్ భాగస్వామ్యంలో విజన్ 2035 లక్ష్యంగా సాగుతున్నాం. ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాల్లో కలిసి సాగుతాం. బ్రిటన్, భారత్ భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కనుంది. ఆరు బ్రిటన్ యూనివర్సిటీలు భారత్లో క్యాంపస్లు ఏర్పాటు చేస్తున్నాయి.
పహల్గాం ఘటనను ఖండించిన బ్రిటన్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు అవకాశమే లేదని నరేంద్ర మోదీ తెలిపారు. అహ్మదాబాద్ విమాన దుర్ఘటన మృతుల్లో బ్రిటన్ దేశస్తులకు సంతాపం తెలిపారు. బ్రిటన్ ప్రధాని ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలుపుతూ త్వరలోనే భారత్కు రావాలని ఆహ్వానిస్తున్నా అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Readmore: https://teluguprabha.net/international-news/india-pakistan-unsc-kashmir-terrorism/
బ్రిటన్ మార్కెట్లో భారతీయ వ్యవసాయ ఉత్పత్తులైన పండ్లు, కూరగాయలు, మసాలాలు, ధాన్యాల పట్ల ఆసక్తి ఎక్కువ. ఈ కారణంగా ఈ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగే అవకాశంతో పాటు ఈ రకమైన పంటలు సాగు చేసే రైతులకు మంచి ధర లభించే అవకాశముంది. ఎగుమతులపై సుంకాల పరిమితి తగ్గించబడిన కారణంగా రైతులకు నేరుగా లాభం చేకూరే అవకాశం ఉంటుంది.
దిగుమతి-ఎగుమతులపై సుంకాలు తగ్గించబడటంతో పాటు, పెట్టుబడులు పెరగడం, ఉద్యోగ అవకాశాలు విస్తరించడం వంటి అనేక అనుబంధ ప్రయోజనాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భారత ఐటీ, టెక్స్టైల్, ఫార్మా, ఆటోమొబైల్ రంగాలకు భారీ ప్రోత్సాహం లభిస్తుంది. బ్రిటన్లో భారతీయ విద్యార్థులు, స్టార్టప్లకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది.


