Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్India-US Trade Deal : అక్టోబరు డెడ్‌లైన్... అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ఉత్కంఠ!

India-US Trade Deal : అక్టోబరు డెడ్‌లైన్… అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ఉత్కంఠ!

US-India strategic trade partnership : దిల్లీ, వాషింగ్టన్ మధ్య నెలకొన్న వాణిజ్య ప్రతిష్టంభనకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. “భారత వాణిజ్య వర్గాల అంచనా ప్రకారం, రెండు దేశాల మధ్య చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందం అక్టోబరు నాటికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ ఒప్పందం త్వరలో ఖరారవుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.” అయితే, భారత్ “మొండిగా” వ్యవహరిస్తోందంటూ అమెరికా వైపు నుంచి వస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్చలు ఎలాంటి మలుపులు తిరగనున్నాయి? సుంకాల యుద్ధంతో వేడెక్కిన వాతావరణంలో ఈ చర్చలు ఫలవంతమవుతాయా..? ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఈ ఒప్పందంలో ఎలాంటి కీలక పాత్ర పోషించనుంది..?

- Advertisement -

తుది అంకానికి చర్చల పర్వం: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం చివరి దశకు చేరుకుందని భారత వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్‌వల్ ప్రకటించడంతో ఈ అంశంపై మళ్ళీ ఆశలు చిగురించాయి. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి ఒప్పందంపై సంతకాలు పూర్తవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఐదు విడతలుగా జరిగిన చర్చలు సఫలం కాగా, ఆరో విడత చర్చల కోసం అమెరికా ఉన్నతస్థాయి బృందం ఆగస్టు 25న భారత్‌కు రానుంది. ఈ చర్చలతో ఒప్పందంలోని ముఖ్యాంశాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

ట్రంప్ యంత్రాంగం ఒత్తిడి, భారత్ దీటైన జవాబు : అయితే, ఈ చర్చల మార్గం సుగమం ఏమీ కాదు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో భారత్ కాస్త మొండి వైఖరి అవలంబిస్తోందని సాక్షాత్తూ అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దన్న హెచ్చరికలను భారత్ పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన ట్రంప్, భారత ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం సుంకాలను విధించారు. ఇప్పటికే 25 శాతం అమల్లోకి రాగా, మిగిలిన 25 శాతం ఈ నెల 27 నుంచి అమల్లోకి రానుంది.

ట్రంప్ సుంకాల బెదిరింపులకు భారత్ తలొగ్గలేదు. దేశంలోని రైతులు, పాల ఉత్పత్తుల రంగం, మత్స్యకారుల ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వారి ప్రయోజనాలను దెబ్బతీసే ఏ ఒప్పందానికీ అంగీకరించేది లేదని, అవసరమైతే ఆ భారాన్ని ప్రభుత్వమే మోస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నప్పటికీ, చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలు భావిస్తున్నాయి.

మోదీ అమెరికా పర్యటనపైనే అందరి చూపు : పెంచిన సుంకాలు పూర్తిగా అమల్లోకి రాకముందే ఒప్పందాన్ని ఖరారు చేసుకోవాలని భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, త్వరలో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. “ఈ పర్యటనలో ఆయన అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో వాణిజ్యపరమైన సమస్యలపై చర్చలు జరుగుతాయని, ఈ ఒప్పందం భవిష్యత్తును ఈ చర్చలే నిర్ణయిస్తాయని దౌత్య వర్గాలు వెల్లడించాయి.”

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad