USA-Iran: అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రస్తుతం శాంతి చర్చలు జరుగుతున్నాయి. దీనికి దాయాది దేశం పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చర్చల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ విధాన కమిషన్ అధికార ప్రతినిధి ఇబ్రహీం రెజాయి పాకిస్తాన్ విశ్వసనీయతపై ఆయన పెదవి విరిచారు. శాంతి చర్చలకు పాకిస్తాన్ తగిన మధ్యవర్తి కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మరోవైపు ఆ దేశ ప్రతినిధులు సైతం ఆయనకే మద్దతు పలికారు. శాంతి చర్చల్లో పాకిస్తాన్ వైఖరి నిష్పక్షపాతంగా లేదని, అమెరికా ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందంటూ ఆ దేశ ప్రతినిధులు పార్లమెంట్ లో ధ్వజమెత్తారు.
పాక్ కు విశ్వసనీయత లేదు
దీంతో ఈ చర్చల ఫలితం ప్రశ్నార్థకంగా మారింది. ఇరాన్ ఎంపీ రెజాయి తన ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై సందేహాలు వ్యక్తం చేశారు. ‘పాకిస్థాన్ మనకు పొరుగు దేశం. మంచి మిత్రదేశమే కావచ్చు.. కానీ చర్చల మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత దానికి లేదు. ఒక మధ్యవర్తి నిష్పక్షపాతంగా ఉండాలి. ఎప్పుడూ ఒక పక్షానికే మొగ్గు చూపకూడదు. అమెరికా ప్రయోజనాలకు పాకిస్తాన్ అనుకూలంగా వ్యవహరిస్తుంది. వాషింగ్టన్ వైఖరిని సవాలు చేసే సాహసం ఇస్లాం దేశం చేయడంలేదు‘ అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా లెబనాన్ వ్యవహారంలో అమెరికా అహేతుకమైన డిమాండ్లు పెట్టినప్పుడు కూడా పాకిస్థాన్ మౌనం వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. మధ్యవర్తులుగా ఉండేవారు రెండు పక్షాల పట్ల సమానంగా ఉండాలి. కానీ, ఒకరివైపు మొగ్గు చూపకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే.. ఇరాన్, అమెరికా మధ్య అనిశ్చితి ఉన్నప్పటికీ చర్చలను సజీవంగా ఉంచడానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న వేళ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్కు ఊహించని షాక్ ఇచ్చినట్టు అయ్యింది. కాగా మార్చిలో జరిగిన తొలి విడత చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయిన సంగతి తెలిసిందే. శాంతి కోసం ఆయా దేశాలు చర్చలకు ముందుకు వచ్చిన.. రెండో విడదత చర్చలపై కూడా అనిశ్చితి కొనసాగుతోంది. ప్రధానంగా రెండు అంశాలు ఈ చర్చలకు ఆటంకంగా మారాయి. శాంతి ఒప్పందంపై పూర్తి స్థాయి సంతకాలు జరిగే వరకు ఇరాన్ ఓడరేవులపై ఉన్న దిగ్బంధనాన్ని తొలగించే ప్రసక్తే లేదని అమెరికా పట్టుబడుతోంది. మరోవైపు తమ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న ఓడరేవుల దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే చర్చల టేబుల్ ముందుకు వస్తామని టెహ్రాన్ స్పష్టం చేస్తోంది.
ట్రంప్ హెచ్చరిక
ఈ క్రమంలో రెండో విడత శాంతి చర్చలపై అనిశ్చితిపై ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. యుద్ధం ముగించటానికి కాల్పుల విరమణకు అంగీకరించడానికి కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉందన్నారు. లేదంటే వారి చమురు పైపులైన్లు పేలిపోతాయని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ చమురు ఎగుమతులను కొనసాగించలేకపోతే యాంత్రికంగా, భూమి సహజశక్తుల కారణంగా పైపులైన్లు విఫలమవుతాయన్నారు. ఇరాన్కు భారీ పరిమాణంలో చమురు సరఫరా వ్యవస్థ ఉందని ఏదైన కారణం చేత అది మూసుకుపోతే అప్పుడు ఇంధనాన్ని కంటైనర్లు లేదా నౌకల్లో నింపడం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం ఇరాన్ అదే పరిస్థితి ఎదుర్కొటోందన్న ట్రంప్.. దిగ్బంధనం కారణంగా వారివద్ద నౌకలు కూడా లేవని పేర్కొన్నారు.

