Iran Protests Thousands of Deaths: ఇరాన్లో జరిగిన నిరసనల్లో భద్రతా సిబ్బందితో సహా సుమారు 2,000 మంది మరణించారని అధికారుల అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇరాన్ ఇంటర్నేషనల్ కథనం ప్రకారం దాదాపు 12,000 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది. రెండు వారాలుగా కొనసాగుతున్న దేశవ్యాప్త అశాంతిని తీవ్రంగా అణచివేయడంతో ఈ మరణాలు సంభవించాయి.
హ్యూమన్ రైట్స్ ప్రకారం
డిసెంబర్ 28 నుంచి ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో మృతుల సంఖ్యకు సంబంధించి వివిధ అంతర్జాతీయ సంస్థలు, నివేదికలు వేర్వేరు గణాంకాలను వెల్లడించాయి. అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (HRANA) నివేదిక ప్రకారం, జనవరి 13 నాటికి మరణించిన వారి సంఖ్య 646కు చేరుకున్నట్లుగా ప్రకటించింది.
అధికారిక గణాంకాలు ఏం చెబుతున్నాయి..
ఇక అధికారిక గణాంకాల ప్రకారం.. దేశంలో చెలరేగిన నిరసనల కారణంగా సుమారు 2,000 మంది మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు. మృతుల్లో దేశ పౌరులతో పాటు భద్రతా సిబ్బంది ఉన్నారని తెలిపారు. వీరంతా ఉగ్రవాదుల దాడుల కారణంగానే చనిపోయారని వెల్లడించారు. మరోవైపు కొన్ని ప్రతిపక్ష మీడియా సంస్థలు, మానవ హక్కుల గ్రూపులు.. ఈ సంఖ్య అంతకంటే ఎక్కువే ఉండవచ్చని అంచనా వేస్తుండటం ఆందోళనకరం.
ఇరాన్ ఇంటర్నేషనల్ కథనం ప్రకారం ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో దాదాపు 12,000 మంది ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని సమాచారం. అయితే దీనిపై స్పష్టత వెలువడాల్సి ఉంది. ఇతర మానవ హక్కుల సంఘాలు నివేదికను పరిశీలిస్తే వివిధ ఆసుపత్రుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 6,000 వరకు ఉండవచ్చని తెలుస్తోంది.
HRANA డేటా ప్రకారం మరణించిన వారిలో 505 మంది నిరసనకారులు, 133 మంది భద్రతా సిబ్బంది, మరియు 9 మంది చిన్నారులు ఉన్నారు. ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఇప్పటివరకు దాదాపు 10,700 మందికి పైగా నిరసనకారులను భద్రతా దళాలు అరెస్టు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
2025 డిసెంబర్ 28న టెహ్రాన్ గ్రాండ్ బజార్లో ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా దేశంలోని ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, ఇరానియన్ రియల్ విలువ పతనం కారణంగా ఆందోళనలు చెలరేగి.. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారాయి. మతపరమైన పాలనను ముగించాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా ఈ నిరసనలు 31 ప్రావిన్స్లకు విస్తరించాయి. ఇక మహిళలు తమ స్వేచ్ఛా పోరాటానికి నిరసనగా.. సుప్రీం లీడర్ ఖమేనీ ఫొటోలను కాల్చి ఆ నిప్పుతో సిగరెట్లు కాల్చడం వైరల్గా మారాయి.
ట్రంప్ హెచ్చరిక
మరో వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. నిరసనకారులపై హింసను ఆపకపోతే ఇరాన్పై సైనిక చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25శాతం సుంకం విధిస్తామని ప్రకటించారు. మరోవైపు ఇజ్రాయెల్ కూడా సరిహద్దుల్లో తన సైనిక సన్నద్ధతను పెంచింది. ఇరాన్ ప్రభుత్వం ఈ ఆందోళనలను అమెరికా, ఇజ్రాయెల్ ప్రోత్సహిస్తున్న కుట్రగా ఆరోపించింది. యుద్ధానికి కూడా సిద్ధమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. 1979 విప్లవం తర్వాత ఇరాన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్గా ఈ ఆందోళనలు నిలిచాయి.

