Is India Facing Highest Trump Tariff?: అంతర్జాతీయ రాజకీయ, వాణిజ్య రంగాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్పై మరోసారి సుంకాల అస్త్రాన్ని ప్రయోగించారు. ఇప్పటికే ఉన్న 25 శాతం సుంకానికి అదనంగా మరో 25 శాతం విధిస్తున్నట్లు, కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీంతో భారత దిగుమతులపై మొత్తం సుంకం 50 శాతానికి చేరింది. రష్యా నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేస్తూ, ఉక్రెయిన్పై యుద్ధానికి పరోక్షంగా నిధులు సమకూరుస్తోందని, దానికి శిక్షగా ఈ చర్య తీసుకుంటున్నామని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో, బ్రెజిల్తో పాటు అత్యధిక అమెరికా సుంకాలను ఎదుర్కొంటున్న దేశంగా భారత్ నిలిచింది.
ఏ దేశంపై ఎంత సుంకం?
- భారత్ 50%
- బ్రెజిల్ 50%
- స్విట్జర్లాండ్ 39%
- కెనడా 35%
- ఇరాక్ 35%
- చైనా 30%
భారత్పై ట్రంప్ తాజా ఉత్తర్వుల ప్రకారం, ఆగస్టు 7 నుంచి అమల్లోకి రానున్న 25 శాతం సుంకానికి ఈ అదనపు సుంకం జత కలుస్తుంది. కొత్తగా విధించిన 25 శాతం సుంకం, ఉత్తర్వులు జారీ అయిన 21 రోజులకు అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయం వల్ల అమెరికా మార్కెట్లో భారత వస్తువులు మరింత ప్రియం కానున్నాయి.
ఈ రంగాలపై ప్రభావం..
ముఖ్యంగా, ఆటోమొబైల్ విడిభాగాలు, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక రంగాలపై తీవ్ర ప్రభావం పడనుందని ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటును మరింత పెంచే అవకాశం ఉంది. అయితే, ఈ అదనపు సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్ వంటి కొన్ని ముఖ్యమైన రంగాలకు మినహాయింపు ఇవ్వడం గమనార్హం.
అమెరికా ద్వంద్వ వైఖరి..
ఈ పరిణామంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అమెరికా చర్యలు అన్యాయమని, ఏకపక్షమని విమర్శించింది. తమ దేశ ఇంధన భద్రత అవసరాల రీత్యానే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేసింది. అమెరికా మిత్రదేశాలతో సహా అనేక దేశాలు రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్నప్పుడు, కేవలం భారత్ను లక్ష్యంగా చేసుకోవడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విదేశాంగ శాఖ పేర్కొంది. దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని తెలిపింది. ఈ సుంకాల యుద్ధం ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాలను ఏ మలుపు తిప్పుతుందోనని అంతర్జాతీయ నిపుణులు ఆసక్తిగా గమనిస్తున్నారు.


