Iran Protests Khamenei Allegations on America: ఇరాన్లో నిరసనలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కారణమని సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆరోపించారు. తమ దేశంలో హింస, మరణాలకు ఆయనే బాధ్యులని మండిపడ్డారు.
ఇరాన్లో ఇటీవల జరిగిన ఆందోళనల వెనుక అమెరికా హస్తం ఉందని ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ ఆరోపించారు. అందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను నేరస్థుడిగా పేర్కొంటున్నామని ఆయన వ్యాఖ్యానించారు. నిరసనల సమయంలో ప్రాణనష్టానికి, ఆస్తినష్టానికి, తమ దేశంపై నిందలు వేసినందుకు డొనాల్డ్ ట్రంప్ బాధ్యులని ఖమేనీ ఆరోపించారు. ఈ కారణంగా ఆయన్ని “నేరస్థుడు”గా పరిగణిస్తున్నామని శనివారం వెల్లడించారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/pawan-kalyan-comments-on-green-ammonia-plant/
తమ దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల్లో అమెరికా అధ్యక్షుడు స్వయంగా జోక్యం చేసుకున్నారని, ఆందోళనకారులను ప్రోత్సహించారని సుప్రీం లీడర్ ఆరోపించారు. ఇటీవల జరిగిన అల్లర్లలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఇరాన్లో నిరసనల్లో పాల్గొన్నవారు అమెరికా కోసం పనిచేసేవారేనని ఖమేనీ అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేశారని.. ఎంతో మందిని గాయపరిచారని వెల్లడించారు.
ట్రంప్ ఇరాన్ అంతర్గత వ్యవహారాలపై కాకుండా తన సొంత దేశాన్ని చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. అంతేకాకుండా ట్రంప్పై ఖమేనీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అహంకారులైన పాలకుల పతనం ఖాయమని, ట్రంప్ కూడా పతనం అవుతారని తీవ్రంగా మండిపడ్డారు. ఇరాన్ను తిరిగి తమ రాజకీయ, ఆర్థిక నియంత్రణలోకి తీసుకురావడమేనని అమెరికా లక్ష్యమని వ్యాఖ్యానించారు.
Also Read: https://teluguprabha.net/national-news/asaduddin-owaisi-comments-on-bmc-results/
‘ఆందోళనకారులు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మందుగుండు సామగ్రిని వినియోగించారు. యుద్ధం వైపు దేశాన్ని తీసుకెళ్లాలని అనుకోవడం లేదు. నేరస్థుల్లో విదేశీయులున్నారు. నేరస్థులెవరినీ విడిచిపెట్టబోం. కేసులు కొనసాగించాలని అధికారులను ఆదేశించాం.’ అని ఖమేనీ అన్నారు.
మరోవైపు ఇరాన్లో ఆందోళనల్లో దాదాపు 3 వేల మంది మృతి చెందినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. ఈ క్రమంలో అమెరికాపై ఖమేనీ వ్యాఖ్యలు, రెండు దేశాల మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలను మరింత పెంచాయి.

