Mass Shooting: అమెరికాలోని మిసిసిపీ రాష్ట్రంలో అర్ధరాత్రి వేళ జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. లేలాండ్ పట్టణంలో జరిగిన ఈ భయానక ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
స్థానిక సెనెటర్ డెరిక్ సిమ్మన్స్ ఈ విషాదకర ఘటనను ధ్రువీకరించారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం వేడుకల్లో భాగంగా జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రజలు ఒకచోట గుమిగూడిన సమయంలో ఈ కాల్పులు జరిగాయని ఆయన వివరించారు. ఈ హఠాత్ దాడితో అక్కడ ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు.
క్షతగాత్రులను వెంటనే రాష్ట్ర రాజధానియైన జాక్సన్ నగరంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, కాల్పులు జరిపిన నిందితులను ఇప్పటి వరకు పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడం గమనార్హం. నగర మేయర్ జాన్లీ ఈ విషయాన్ని ఒక వార్తా సంస్థకు వెల్లడించారు. లేలాండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తోంది. మాజీ విద్యార్థుల ఆనందకరమైన వేడుక విషాదంగా మారడంతో స్థానికంగా తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది.


