Sunday, June 22, 2025
Homeఇంటర్నేషనల్ISRAEL IRAN CONFLICT : అమెరికా యుద్ధం ప్రారంభించింది - తీవ్ర పరిణామాలు తప్పవు

ISRAEL IRAN CONFLICT : అమెరికా యుద్ధం ప్రారంభించింది – తీవ్ర పరిణామాలు తప్పవు

Iran’s Fierce Missile Attack on Israel : అమెరికా తమ అణు స్థావరాలపై జరిపిన దాడులకు ప్రతీకారంగా, ఇరాన్ తన చిరకాల శత్రువైన ఇజ్రాయెల్‌పై ఆదివారం తెల్లవారుజామున క్షిపణులతో భీకర దాడికి తెగబడింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) రెండు విడతల్లో 27 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి, ఇజ్రాయెల్‌లోని హైఫా, టెల్ అవీవ్‌లను లక్ష్యంగా చేసుకుంది. టెల్ అవీవ్ సమీపంలోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదించబడింది. ఈ దాడుల వల్ల ఇజ్రాయెల్‌లో కనీసం 11 మంది గాయపడగా, దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ సైరన్‌లు మోగాయి.

ఇజ్రాయెల్ ప్రతీకారం: ఇరాన్‌పై బాంబుల వర్షం : ఇరాన్ దాడికి ప్రతిస్పందనగా, ఇజ్రాయెల్ వైమానిక దళాలు తక్షణమే తిరుగుదాడులు ప్రారంభించాయి. ఇరాన్‌లోని సైనిక శిబిరాలపై బాంబుల వర్షం కురిపించినట్లు సమాచారం. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత తీవ్ర స్థాయికి చేర్చాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్, దాని అనుబంధ మిలిటెంట్ సంస్థలు బలంగా ప్రతిస్పందిస్తూ, ప్రాంతీయ స్థిరత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి.

యుద్ధం అమెరికాదే, ఇరాన్ ఆగ్రహం : ఈ దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. యుద్ధాన్ని అమెరికానే ప్రారంభించిందని ఆరోపించింది. ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ మారణహోమం సృష్టిస్తున్నా, దానికి అమెరికా మద్దతు ఇస్తోందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. తమ మూడు అణు స్థావరాలపై అమెరికా చేసిన దాడులకు ప్రతీకారంగా, అమెరికా సైనిక సాహసానికి తమ పూర్తి శక్తితో బదులిస్తామని ఇరాన్ ప్రకటించింది. తమ దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి పోరాడతామని, శత్రువును ఎదుర్కొనే హక్కు తమకు ఉందని ఇరాన్ స్పష్టం చేసింది.

తీవ్ర పరిణామాలు తప్పవు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక : ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి అమెరికా దాడులకు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆదివారం ఉదయం ‘X’ వేదికగా ఆయన పోస్ట్ చేస్తూ, తమ దేశ అణు స్థావరాలపై అమెరికా దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి ఛార్టర్ ప్రకారం ఇరాన్‌కు తిరిగి సమాధానం చెప్పే హక్కు ఉందని, తమ దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలు, ప్రజల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

భద్రతా మండలి అత్యవసర సమావేశానికి డిమాండ్ : ఇరాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా చేసిన దాడుల గురించి చర్చించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెంటనే అత్యవసర సమావేశం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావని గట్టిగా డిమాండ్ చేశారు. అమెరికా దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైనవని ఆయన ఆరోపించారు. ఈ దాడులకు అమెరికాను బాధ్యులను చేయాల్సిన అవసరం భద్రతా మండలికి ఉందని, ఐక్యరాజ్యసమితి నియమాలు, అంతర్జాతీయ చట్టాల ప్రకారం అమెరికాపై చర్యలు తీసుకోవాలని కోరారు. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడానికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే కారణమని అమీర్ సయీద్ తెలిపారు. జూన్ 13న ఇజ్రాయెల్ తమ శాంతియుత అణు స్థావరాలపై దాడి చేసిందని, దానికి కొనసాగింపుగానే ఆదివారం అమెరికా కూడా దాడులు చేసిందని ఆయన ఆరోపించారు.

ట్రంప్‌కు నెతన్యాహూ అభినందనలు: మరోవైపు, ఇరాన్‌ అణు స్థావరాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ జరిపిన దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రశంసించారు. ఈ చర్యతో ట్రంప్ చరిత్ర సృష్టించారని, అమెరికా బలం మరోసారి ప్రపంచానికి తెలిసిందని ఆయన కొనియాడారు. ఇరాన్‌పై దాడులు పశ్చిమాసియాలో శాంతి, సుసంపన్నతకు మార్గం సుగమం చేస్తాయని నెతన్యాహూ అన్నారు. ట్రంప్ ప్రపంచంలోనే అత్యంత ‘ప్రమాదకరమైన పాలకుడి’కి వ్యతిరేకంగా పోరాడారని, ఇది అమెరికా, ఇజ్రాయెల్‌ల బంధాన్ని బలపరుస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News