Nepal: పొరుగుదేశం నేపాల్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో తాత్కాలిక సారథిని ఎన్నుకునేందుకు అక్కడి యువత ముమ్మర చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీ వైపు జెన్-జీ ఉద్యమకారులు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. తాత్కాలిక సారథిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆమె కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం. అవినీతికి వ్యతిరేకంగా నేపాల్లో కొనసాగుతున్న ఉద్యమం హింసాత్మక ఘటనలకు దారితీయడంతో ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో, కొత్త సారథిని ఎన్నుకునేందుకు జెన్-జీ ఉద్యమకారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 5వేల మంది బుధవారం వర్చువల్గా సమావేశమై చర్చలు జరిపారు. ఖాట్మండు మేయర్ బాలెన్ షాను పేరుని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ఆయన నుంచి స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో, మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీ వైపు ‘జెన్-జీ’ ప్రతినిధులు మొగ్గుచూపినట్లు నేపాల్ మీడియా వెల్లడించింది. బాధ్యతలు స్వీకరించేందుకు కర్కీ సిద్ధమైతే.. తొలుత ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్తో భేటీ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధ్యక్షుడు రామ్చంద్ర పౌడెల్ ఆమోదం పొందాల్సి ఉంటుందని అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also: Weight loss bonus: చైనా కంపెనీ వినూత్న ఆలోచన.. బరువు తగ్గితే బోనస్..!
సుశీలా కర్కీ ఎవరంటే?
సుశీలా కర్కీకి నేపాల్ చరిత్రలో ప్రముఖ స్థానం ఉంది. తొలుత టీచర్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత న్యాయవ్యవస్థలో అడుగుపెట్టారు. నిర్భయంగా, సమర్థంగా విధులు నిర్వర్తిస్తూ అవినీతి మరకలేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. 2009లో సుప్రీంకోర్టులో అడుగుపెట్టి.. శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు చీఫ్ జస్టిస్గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టి.. నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించారు.
Read Also: Supreme Court: నేపాల్లో పరిస్థితి గమనించండి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
నేపాల్ లో ఆందోళన
నేపాల్లో గత రెండు రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ముగ్గురు పోలీసులు సహా 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, మరో 633 మంది గాయాపడినట్లు పేర్కొన్నారు. ఆందోళనల్లో గాయపడిన నేపాలీ కాంగ్రెస్ చీఫ్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా, ఆయన భార్య, విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవ్బాలు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాగా.. వారు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే, నేపాల్లో ఆందోళనలు అదుపులోకి రాకపోవడంతో సైన్యం నిరవధిక కర్ఫ్యూ విధించింది.


