Pak Minister Sensational comments on Afghanistan Pakistan Conflict: పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినప్పటికీ ఎప్పుడు యుద్ధం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ రక్షణ శాఖా మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ”ఆఫ్గనిస్థాన్, భారత్తో యుద్ధానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఆఫ్గనిస్థాన్కు భారత్ సపోర్ట్ చేయడాన్ని అంత సులభంగా విడిపెట్టం. అఫ్గాన్, భారత్తో ద్విముఖ యుద్ధానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉంది. దీనికోసం మా వద్ద వ్యూహాలు కూడా ఉన్నాయి. కానీ వాటి గురించి ఇప్పుడు నేను మాట్లాడను. మా దేశంలో నివసిస్తున్న అఫ్గాన్ శరణార్థుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వాళ్లు దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం పాక్లో అక్రమంగా ఉంటున్న వాళ్లని గుర్తిస్తున్నాం. వెంటనే వాళ్లు మా దేశం నుంచి వెళ్లిపోవాలి” అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, గత కొన్ని రోజులుగా పాకిస్థాన్-అఫ్గాన్ సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇరువైపుల పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. అయితే, పాకిస్థాన్పై దాడులు మొదలైనప్పుడు అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి ఢిల్లీలోనే ఉన్నారని పాక్ ఆరోపిస్తోంది. భారత్ ఆదేశాల మేరకు తమపై దాడులు చేశారని తలా తోకా లేని వ్యాఖ్యలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ తరఫున అఫ్గాన్ తమపై పరోక్ష యుద్ధానికి దిగిందని పాక్ రక్షణశాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆరోపించారు.
భారత విదేశాంగ శాఖ స్ట్రాంక్ కౌంటర్..
పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ కూడా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ” పాక్ ఉగ్రవాద సంస్థలకు ఆతిథ్యమిస్తూ వాళ్ల కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. పాక్లో అంతర్గత వైఫల్యాలకు ఇతరులను నిందించడం ఆ దేశానికి అలవాటే. అఫ్గానిస్థాన్ తన సొంత భూభాగాలపై సార్వభౌమత్వం కోసం పోరాడుతోంది. పాకిస్థాన్ పోరాటానికి మేం మద్ధతిస్తున్నాం. ఇది పాకిస్థాన్కు కోపం తెప్పిస్తోంది.” అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, పాకిస్థాన్పై యుద్ధంలో ఆఫ్గనిస్థాన్కు భారత్ కూడా సపోర్టు ఇస్తోంది. భారత్, అఫ్గాన్ దగ్గరవ్వడంతో పాకిస్థాన్ మళ్లీ మేకపోతు గాంభీర్యం చూపిస్తోంది.
పాక్-అఫ్గాన్ మధ్య తీవ్రమైన ఘర్షణలు..
అఫ్గాన్ భూభాగాన్ని స్థావరంగా చేసుకున్న తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు.. పాక్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఓరక్జాయ్ జిల్లాలో ఇటీవల దాడులు చేయగా పాకిస్థాన్కు చెందిన పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో గత గురువారం అఫ్గాన్ రాజధాని కాబుల్లో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లకు పాకిస్థాన్ కారణమని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. దాడి జరిగిన సమయంలో అఫ్గాన్ విదేశాంగమంత్రి భారత్ పర్యటనలో ఉండటం గమనార్హం. ఉగ్రవాదుల ఏరివేత పేరుతో తమ సరిహద్దుల్లో దాడులు చేసిన పాకిస్థాన్ ఆర్మీపై అఫ్గాన్ కూడా అదే స్థాయిలో సమాధానమిచ్చింది. ఆ దాడుల్లో 58 మంది పాక్ సైనికులు మరణించినట్లు తాలిబన్ నేతృత్వంలోని ప్రభుత్వం వెల్లడించింది. తర్వాత కూడా ఆ ఘర్షణలు కొనసాగాయి. భారత ఆదేశాల మేరకే తమపై దాడులు జరిగాయని పాక్ ఆరోపిస్తోంది.


