Pakistan Defence Minister Calls Floods a ‘Blessing: పాకిస్థాన్లో రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలు, వరదలతో వేలాది గ్రామాలు మునిగిపోయాయి, లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. వరదలను ఒక ‘వరం’గా భావించాలని, వరద నీటిని ఇళ్లలో బకెట్లు, టబ్బులు, కంటైనర్లలో నిల్వ చేసుకోవాలని ఆయన సూచించారు.
పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్లో వరదలు విలయతాండవం చేస్తున్నాయి. దీంతో 2.4 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ఈ నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ‘దునియా న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. “వరదలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రజలు, ఆ నీటిని ఇళ్లకు తీసుకువెళ్లాలి. మనం ఈ నీటిని వరంలా చూడాలి, దానిని బకెట్లు, టబ్బులు, కంటైనర్లలో నిల్వ చేసుకోవాలి” అని ఆయన విచిత్రంగా వ్యాఖ్యానించారు.
మంత్రి ఈ వ్యాఖ్యలను చాలామంది తీవ్రంగా ఖండించారు. లక్షలాది మంది ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డున పడిన ఈ తరుణంలో ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు, రాజకీయ నాయకులు విమర్శించారు.
ALSO READ: Indonesia: రాజకీయ నాయకులకు అధిక జీతాలు.. పార్లమెంట్ భవనాలను తగులబెట్టిన నిరసనకారులు
“నదుల కోసం సింధీ ప్రజలు రోడ్లను బ్లాక్ చేస్తున్నారు. వారు ఈ వరదలను వరంలా భావించి, ఆ నీటిని ఇళ్లలో ఉంచుకోవాలి” అని ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మరోవైపు, ఖవాజా ఆసిఫ్ వరద నీటిని నిల్వ చేసుకునేందుకు భారీ ప్రాజెక్టుల కోసం 10-15 ఏళ్లు వేచి చూడటం కంటే, చిన్న చిన్న డ్యామ్లు నిర్మించాలని కూడా సూచించారు. “మనం వరద నీటిని వృథాగా పోనిస్తున్నాం. దానిని నిల్వ చేసుకోవాలి” అని ఆయన అన్నారు.
ALSO READ: India-Russia Oil Deal: అమెరికా ఆంక్షల వేళ భారత్కు రష్యా బంపర్ ఆఫర్
పాకిస్థాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) నివేదిక ప్రకారం, జూన్ 26 నుంచి ఆగస్టు 31 వరకు వరదల్లో 854 మంది మరణించగా, 1,100 మందికి పైగా గాయపడ్డారు. వరదల కారణంగా వ్యవసాయ భూములు మునిగిపోవడంతో, దేశంలో ఆహార సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.
ALSO READ: Shehbaz Sharif : భారత్-రష్యా సంబంధాలు అద్భుతం.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్


