PM Modi Japan Visit : భారత విదేశాంగ విధానంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం తూర్పు ఆసియాలోని రెండు అగ్ర దేశాలైన జపాన్, చైనాలలో పర్యటించనున్నారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ప్రత్యేక ఆహ్వానం మేరకు టోక్యోలో అడుగుపెట్టనున్న మోదీ, అక్కడి నుంచి నేరుగా చైనాకు వెళ్లనుండటం అంతర్జాతీయంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. మారుతున్న ప్రపంచ సమీకరణాల నేపథ్యంలో, ఈ రెండు దేశాలతో భారత్ జరపబోయే చర్చల ప్రాధాన్యత ఏమిటి..? రక్షణ, వాణిజ్యం వంటి కీలక అంశాలపై ఎలాంటి ఒప్పందాలు కుదరనున్నాయి..? ఉద్రిక్తతల నడుమ చైనా పర్యటనకు దారితీసిన పరిస్థితులేంటి..?
జపాన్తో స్నేహబంధం మరింత పటిష్ఠం: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29, 30 తేదీలలో జపాన్లో పర్యటించనున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రి అధికారికంగా ప్రకటించారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు మోదీ ఈ పర్యటన చేపట్టారు.
15వ వార్షిక శిఖరాగ్ర సదస్సు: ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు.
ద్వైపాక్షిక చర్చలు: ఆగస్టు 29న టోక్యో చేరుకున్న వెంటనే, మోదీ జపాన్ ప్రధాని ఇషిబాతో ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో రక్షణ, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, అధునాతన సాంకేతికత వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరు నేతలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
మోదీకి ఇది 8వ పర్యటన: ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మోదీ జపాన్లో పర్యటించడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనం.
అనంతరం నేరుగా చైనాకు: జపాన్ పర్యటన ముగించుకున్న వెంటనే, ప్రధాని మోదీ అక్కడి నుంచి నేరుగా చైనాకు బయలుదేరి వెళ్తారు.
షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు: చైనాలోని ప్రముఖ ఓడరేవు నగరం తియాంజిన్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ వేదికపై చైనా అధ్యక్షుడు, ఇతర సభ్య దేశాల అధినేతలతో మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది.
మెరుగవుతున్న సంబంధాల నడుమ: గత కొంతకాలంగా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్-చైనా సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న సంకేతాలు వెలువడుతున్న తరుణంలో మోదీ చైనా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.


