Robbery in Louvre Museum: పారిస్లోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లౌవ్రే మ్యూజియంలో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ సంఘటన చోటుచేసుకుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ మ్యూజియం నుంచి నెపోలియన్ సామ్రాజ్యానికి చెందిన అపురూప ఆభరణాలను దొంగలు అపహరించరినట్లు ఫ్రెంచ్ మీడియా పేర్కొంది. ఈ ఘటనలో మ్యూజియంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపింది.
పారిస్లోని లౌవ్రే మ్యూజియంలో నిర్మాణంలో ఉన్న ప్రాంతం నుంచి బాస్కెట్ లిఫ్ట్ సాయంతో మ్యూజియం లోపలికి దొంగలు ప్రవేశించారు. డిస్క్ కట్టర్ వంటి పరికరాలతో గ్యాలరీ పగులగొట్టి, నెపోలియన్, ఎంప్రెస్ యూజీనీకి చెందిన తొమ్మిది విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఫ్రెంచ్ మీడియా తెలిపింది. కేవలం ఏడు నిమిషాల వ్యవధిలో ఈ దోపిడీని దొంగలు పూర్తి చేశారు. చోరీ అనంతరం దొంగల ముఠా మోటార్సైకిళ్లపై పారిపోయినట్లు తెలుస్తోంది.
కాగా, దోపిడీ సమయంలో మ్యూజియం తెరిచి ఉందని ఫ్రెంచ్ సాంస్కృతిక శాఖ మంత్రి రాషిడా దతి ధ్రువీకరించారు. మ్యూజియంలోని ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. ఇక, చోరీకి గురైన ఆభరణాల చారిత్రక, వారసత్వ విలువ అపారమైనదని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన జరిగిన వెంటనే మ్యూజియంను మూసివేసి, దర్యాప్తు చేపట్టారు.
అయితే, దొంగిలించబడిన ఆభరణాల్లో ఒకటి, ఎంప్రెస్ యూజీనీ కిరీటం డ్యామేజ్ అయి మ్యూజియం బయట దొరికినట్లు సమాచారం. కాగా, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మోనాలిసా అసలు చిత్రం కూడా అదే మ్యూజియంలో ఉంది. ఈ మ్యూజియానికి సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది. గతంలోనూ ఈ మ్యూజియంలో దుండగులు చోరీకి యత్నించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1911లో మ్యూజియంలో పనిచేసే మాజీ కార్మికుడు మోనాలిసా చిత్రాన్ని దొంగిలించాడు. రెండేళ్ల విచారణ తర్వాత అతడి నుంచి మోనాలిసా చిత్రాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
🚨BREAKING🚨:7-MINUTE LOUVRE HEIST STUNS FRANCE 🇫🇷💎
Thieves stole nine jewels from Napoleon and the Empress’s collection after entering the Louvre’s Apollo Gallery via a lift truck. One broken crown was later found nearby. The 140-carat Regent Diamond was left untouched. pic.twitter.com/QlELlfkqw4
— The_Independent (@TheIndeWire) October 19, 2025
1983లోనూ మ్యూజియంలో రెండు పురాతన కవచాలు చోరీకి గురయ్యాయి. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అధికారులు వాటిని కనుగొన్నారు. వివిధ రాజ్యాలకు సంబంధించిన చిత్రాలు, శిల్పాలు ఈ మ్యూజియంలో కొలువు దీరి ఉన్నాయి. రోజుకు 30వేల మంది వరకూ ఈ మ్యూజియంను సందర్శిస్తుంటారు.


