Seattle accident:అమెరికాలోని సియాటెల్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ఆమె మరణానికి సంబంధించి పరిహారంగా 29 మిలియన్ డాలర్లు, భారత కరెన్సీలో సుమారు రూ.262 కోట్లు, ఆమె కుటుంబానికి చెల్లించేందుకు సియాటెల్ నగర పాలక యంత్రాంగం అంగీకరించింది. ఈ విషయాన్ని సిటీ అటార్నీ జనరల్ ఎరికా ఇవాన్స్ అధికారికంగా ప్రకటించారు.
సియాటెల్ నగరంలో..
ఈ ఘటన 2023 జనవరి 23న జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల జాహ్నవి కందుల అమెరికాలో నార్త్ ఈస్ట్రన్ యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతోంది. ఆ రోజు సియాటెల్ నగరంలో రోడ్డు దాటుతున్న సమయంలో కెవిన్ డవే అనే పోలీస్ అధికారి నడుపుతున్న పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది. అక్కడ అనుమతించబడిన వేగ పరిమితి గంటకు 40 కిలోమీటర్లు కాగా, ఆ వాహనం సుమారు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఢీకొట్టిన ప్రభావంతో జాహ్నవి సుమారు 100 అడుగుల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందింది.
బాడీ కెమెరా వీడియో…
ప్రమాదం తరువాత బయటకు వచ్చిన బాడీ కెమెరా వీడియో ఈ కేసును అంతర్జాతీయ స్థాయిలో చర్చకు తెచ్చింది. సంఘటన స్థలానికి వచ్చిన మరో పోలీస్ అధికారి డేనియల్ ఆడరర్, జాహ్నవి మరణాన్ని తేలికగా తీసుకుంటూ వ్యాఖ్యలు చేయడం వీడియోలో రికార్డైంది. ఈ దృశ్యాలు బయటపడిన తర్వాత భారత్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ అంశంపై స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అనంతరం డేనియల్ ఆడరర్ను విధుల నుంచి తొలగించారు.
పరిహారంపై ఒప్పందానికి ..
ఈ కేసు పై సుదీర్ఘ న్యాయ ప్రక్రియ కొనసాగింది. బాధిత కుటుంబం న్యాయం కోసం పోరాటం చేసింది. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడం, భారత ప్రభుత్వం స్పందించడం వంటి పరిణామాల తర్వాత చివరకు సియాటెల్ నగరం పరిహారంపై ఒప్పందానికి వచ్చింది.
జాహ్నవి మరణం చాలా దురదృష్టకరమని, అందిస్తున్న ఈ పరిహారం వారి కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయలేదని సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ తెలిపారు. అయితే ఈ నిర్ణయం కుటుంబానికి కొంత ఆర్థిక భరోసా కలిగిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

