Monday, March 16, 2026
Homeఇంటర్నేషనల్IRIS Dena: ఇరాన్‌ యుద్ధనౌక మునక..100 మందికి పైగా గల్లంతు!

IRIS Dena: ఇరాన్‌ యుద్ధనౌక మునక..100 మందికి పైగా గల్లంతు!

Iranian Warship IRIS Dena:పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో శ్రీలంక సముద్ర తీరంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంలో ప్రమాదానికి గురైన ఇరాన్ యుద్ధ నౌక నుంచి 32 మందిని సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రులకు తరలించినట్లు ఆ దేశానికి చెందిన ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. రక్షించబడిన వారిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, మరో ఏడుగురికి అత్యవసర వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

గాలె తీరానికి సుమారు…

శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ పార్లమెంటులో మాట్లాడుతూ గాలె తీరానికి సుమారు 40 నాటికల్ మైళ్ల దూరంలో IRIS Dena అనే ఇరాన్ యుద్ధ నౌక ప్రమాదంలో ఉన్నట్లు నౌకాదళానికి సమాచారం అందిందన్నారు. సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించామని చెప్పారు. నౌకాదళ నౌకలు మరియు వైమానిక దళ విమానాలను ఘటన స్థలానికి పంపినట్లు వివరించారు.

Also Read:https://teluguprabha.net/international-news/israel-destroys-secret-iran-nuclear-facility-idf-says/

180 మంది సిబ్బంది..

ఈ యుద్ధ నౌకలో మొత్తం 180 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం అందిందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 30 మందిని రక్షించామని, మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, మిగిలిన వారి పరిస్థితిపై స్పష్టత రాబడుతున్నట్లు వెల్లడించారు.

ఇజ్రాయెల్, అమెరికా దాడులు…

ఈ ఘటన పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య చోటుచేసుకోవడం గమనార్హం. ఇజ్రాయెల్, అమెరికా దాడులు, వాటికి ప్రతిగా ఇరాన్ చేపట్టిన చర్యలతో ప్రాంతం ఇప్పటికే ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలోని సముద్ర ప్రమాదం మరింత చర్చనీయాంశమైంది.

నౌక ఎలా దెబ్బతింది, ప్రమాదానికి అసలు కారణం ఏమిటి, సిబ్బంది ఎలా గాయపడ్డారు అనే విషయాలపై అధికారికంగా పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ నౌకపై జలాంతర్గామి దాడి జరిగి ఉండొచ్చని సమాచారం వెలువడింది. అలాగే 100 మందికి పైగా సిబ్బంది గల్లంతైనట్లు, 78 మంది గాయపడినట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ అంశాలపై అధికారిక ధృవీకరణ కోసం ఎదురుచూస్తున్నారు.

ఆధునిక యుద్ధ నౌకల్లో…

IRIS Dena ఇరాన్ ఇటీవల ప్రవేశపెట్టిన ఆధునిక యుద్ధ నౌకల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ నౌక ప్రస్తుతం అమెరికా ఆంక్షల జాబితాలో ఉందని సమాచారం. అంతర్జాతీయ సముద్ర వ్యూహాలలో భాగంగా వివిధ దేశాల తీర ప్రాంతాల్లో విన్యాసాల్లో పాల్గొంటూ వస్తోంది.

ఇటీవల విశాఖ తీరంలో నిర్వహించిన సముద్ర విన్యాసాల్లో ఈ నౌక పాల్గొన్నట్లు సమాచారం. ఆ కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో ఉండగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమిక వివరాలు చెబుతున్నాయి. అయితే ఈ వివరాలపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

Also Read:https://teluguprabha.net/international-news/iran-new-supreme-leader-mojtaba-khamenei-israel-warning/

శ్రీలంక నౌకాదళం,వైమానిక దళం సంయుక్తంగా చేపట్టిన రక్షణ చర్యల వల్ల ప్రాణనష్టం తగ్గిందని అధికారులు తెలిపారు. సముద్రంలో మునిగిపోతున్న నౌక నుంచి సిబ్బందిని సురక్షితంగా బయటకు తీయడం సవాల్‌గా మారిందని చెప్పారు. గాయపడిన వారికి తక్షణ వైద్యం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News