Trump: ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరోసారి నోరుపారేసుకున్నారు. రష్యాతో భారత్ కొనసాగిస్తున్న విధానాలపై ఆయన పదే పదే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే.. ఆయన ఆరోపణలు అబద్ధమని ఎక్స్ తన ఫ్యాక్ట్ చెక్ చేసి తిప్పికొట్టింది. అయినప్పటికీ.. నవారో తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం గమనార్హం. ‘భారత్ అత్యధిక సుంకాలు విధించడం వల్లే అమెరికాలో నిరుద్యోగం పెరిగింది. అమెరికా ఉద్యోగాలు దెబ్బతింటున్నాయి. రష్యా నుంచి భారత్ కేవలం లాభం కోసమే ఇంధనం కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్తో మాస్కో చేస్తున్న యుద్ధాన్ని సమర్థిస్తోంది. యుద్ధంలో ఇరుదేశాల ప్రజలు ప్రాణాలు చనిపోతున్నారు.’ అని నవారో ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై ‘ఎక్స్’ ఫ్యాక్ట్ చెక్ చేసి.. ఆ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. ఇధన భద్రత కోసమే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందని పేర్కొంది. భారతదేశం ఎలాంటి ఆంక్షలను ఉల్లంఘించడంలేదని స్పష్టం చేసింది. యూఎస్ (US) కూడా రష్యా (Russia) నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటున్న విషయాన్ని ప్రస్తావించింది. నవారో వ్యాఖ్యలు అవాస్తవమని, కపటమైనవని పేర్కొంది.
Read Also: Khalistani: ఖలిస్థానీలకు మా దేశం నుంచే నిధులు- కెనడా ప్రకటన
ఫ్యాక్ట్ చెప్ పై నవారో స్పందన
అయితే, ఈ ఫ్యాక్ట్ చెక్పై నవారో నిప్పులు చెరిగారు. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk)పై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ‘ఎక్స్’ నిర్వహించిన ఫ్యాక్ట్ చెక్ ఒక చెత్తగా అభివర్ణించారు. భారత్ లాభపేక్ష కోసమే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందంటూ తన ఆరోపణలను సమర్థించుకున్నారు. ఉక్రెయిన్ భూభాగాన్ని మాస్కో ఆక్రమించక ముందు.. ఈ కొనుగోళ్లు జరగలేదన్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ ప్రజలను చంపడం, అమెరికన్ల ఉద్యోగాలు తీసుకోవడం ఆపాలంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Tripti Dimri: అప్పుడు సంతూర్ మమ్మీ.. ఇప్పుడు నేషనల్ క్రష్..!
దీనిపైనా ‘ఎక్స్’ ఫ్యాక్ట్ చెక్ చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం భారత్ సొంత నిర్ణయమని, అది ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని పేర్కొంది. చమురు కొనుగోలు చేయొద్దంటూ భారత్పై ఒత్తిడి తెస్తూనే.. అమెరికా రష్యా నుంచి యురేనియం వంటి వాటిని దిగుమతి చేసుకుంటోందని తెలిపింది. యూఎస్ ద్వంద ప్రమాణాలకు ఇది అద్దంపడుతోందని మండిపడింది. మరోవైపు, భారత్ పై అమెరికా 50 శాతం సుంకాలు విధిస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. దీంతో, ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా, రెండు దేశాల మధ్య జరగాల్సిన వాణిజ్య ఒప్పందం కూడా నిలిచిపోయింది. మరోవైపు, ఈ టారిఫ్లను కొందరు అమెరికా విశ్లేషకులు తప్పుపట్టగా.. పీటర్ నవారో, బెసెంట్ వంటి వారు మాత్రం భారత్ను ఉద్దేశిస్తూ పిచ్చి ప్రేలాపణలు మాట్లాడుతున్నారు. కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని నవారో ఇటీవల చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఆయన మాటలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.


