H-1B visa applications: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చారు. హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను ఏకంగా లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ నిర్ణయం భారతీయ, చైనీస్ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
లక్ష డాలర్ల వార్షిక రుసుం: అమెరికాలో పనిచేస్తున్న కంపెనీలు ఇకపై విదేశీ నిపుణులను నియమించుకోవడానికి జారీ చేసే ప్రతి హెచ్-1బీ వీసాకు ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు యూఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ఒక ప్రకటనలో తెలిపారు. “మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి. అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి” అని లుట్నిక్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై యాపిల్, గూగుల్, మెటా వంటి దిగ్గజ టెక్ కంపెనీలు ఇంకా స్పందించలేదు.
Also Read:https://teluguprabha.net/international-news/trump-claims-stopped-india-pakistan-war-modi-friendship/
పెనుభారం కానున్న నిర్ణయం: 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం హెచ్-1బీ వీసా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ వీసాలు మూడు నుంచి ఆరు సంవత్సరాల కాలానికి జారీ అవుతాయి. ప్రస్తుతం హెచ్-1బీ వీసాదారుల్లో భారత్ 71 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా.. చైనా 11.7 శాతంతో ఉంది. అమెరికా ఏటా 85 వేల వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తుంది. సాధారణంగా వీసా ఛార్జీలను కంపెనీలే భరిస్తాయి. కానీ కొత్తగా పెంచిన లక్ష డాలర్ల వార్షిక రుసుం కంపెనీలకు పెను భారం కానుంది.
గోల్డ్కార్డు ప్రకటన: వీసా రుసుం పెంపుతో పాటుగా.. ట్రంప్ “గోల్డ్కార్డు” అనే కొత్త విధానాన్ని కూడా ప్రకటించారు. దీని రుసుం 10 లక్షల డాలర్లుగా నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు 100 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. ఈ నిధులను పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులు, రుణాల చెల్లింపులకు ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు.


