Trump-Pak PM Meet in White House: ఓవైపు భారత్పై సుకాంలు పెంచుతూ కయ్యానికి కాలు దువ్వుతూ.. మరోవైపు, పాకిస్థాన్కు మరింత దగ్గరవుతోంది అమెరికా. మొన్నా మధ్య పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్.. అగ్రరాజ్యంలో పర్యటించిన విషయం మరిచిపోక ముందే తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. వైట్హౌస్లోని ఓవల్ ఆఫీసులో వీరి మధ్య అంతర్గత సమావేశం జరిగింది. షరీఫ్ వెంట మునీర్ కూడా ఉన్నారు. ఈ భేటీకి మీడియాను అనుమతించకపోవడం గమనార్హం. అమెరికా కాలమానం ప్రకారం, గురువారం సాయంత్రం 4.52 గంటలకు పాక్ ప్రధాని షరీఫ్ బృందం వైట్హౌస్కు చేరుకుంది. ఆ సమయంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతున్నారు. దీంతో దాదాపు గంట పాటు అమెరికా అధ్యక్షుడి కోసం పాక్ నేతలు ఎదురుచూశారు. అటు మీడియాతో మాట్లాడిన ట్రంప్.. షరీఫ్ గురించి ప్రస్తావించారు. ఆయనో గొప్ప నేత, గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. అనంతరం ఓవల్ ఆఫీసుకు వెళ్లి పాక్ ప్రధానితో ట్రంప్ భేటీ అయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే, ఈ భేటీలో వీరు ఏం చర్చించారన్నదానిపై స్పష్టత లేదు. పైకి ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, ప్రాంతీయ భద్రతపై చర్చించినట్లు చెబుతున్నా.. లోపల మాత్రం రహస్య చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ మధ్య పాకిస్థాన్తో ట్రంప్ సంబంధాలు బలపర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓవల్ కార్యాలయంలోకి మీడియాను అనుమతించకుండా షరీఫ్, మునీర్తో ట్రంప్ కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. సమావేశంలో ఏం చర్చించారో ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పాక్ ప్రధాని షరీఫ్ అమెరికాకు వెళ్లారు. ఈ సందర్భంగా షరీఫ్కు ట్రంప్ ఆయనకు స్వాగతం పలికారని తెలుస్తోంది.
Also Read: https://teluguprabha.net/telangana-news/tgsrtc-smart-cards-for-bus-pass/
భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత..
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ట్రంప్తో భేటీ అవడం ఇదే తొలిసారి. 2019లో అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వైట్హౌస్లో ట్రంప్తో సమావేశమయ్యారు. అంతకుముందు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ 2015లో అమెరికాలో పర్యటించారు. ఇక, ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికా వెళ్లినప్పుడు ఆయనకు శ్వేతసౌధంలో విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలి కాలంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ అమెరికాలో వరుస పర్యటనలు చేస్తున్నారు. మునీర్ గతంలో జూన్, ఆగస్టు నెలల్లో అమెరికాలో పర్యటించారు. జూన్ పర్యటనలో మునీర్కు ట్రంప్ వైట్ హౌస్లో విందు ఇచ్చారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక అభివృద్ధిపై చర్చలు జరిగాయని కొన్ని మీడియా కథనాలు తెలిపాయి. ఈ విందు అనంతరం అమెరికా.. పాకిస్తాన్లో చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి సహాయం చేస్తామని ప్రకటించింది. అలాగే, ఖనిజ రంగంలో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు అమెరికా సాయం చేసింది.


