Trump about Iran: ఒక్క దెబ్బతో ఇరాన్లో 48 మంది అగ్రనేతలను అంతం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడుల పరంపర కొనసాగుతుండగా.. ట్రంప్ చేసిన ఈ ప్రకటన వైరల్ అవుతోంది. కాగా, అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే.
అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఆదివారం నాటికి పరిస్థితి చేజారిపోవడంతో.. పూర్తిస్థాయి యుద్ధ వాతావరణం పౌరుల్లో భయాందోళన కలిగిస్తోంది. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’తో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందగా.. తమ నాయకుడి మృతికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ శత్రు దేశాలపై దాడులతో విజృంభిస్తోంది.
టెహ్రాన్ నడిబొడ్డున అమెరికా, ఇజ్రాయెల్ దళాలు.. దాదాపు 1,200కు పైగా బాంబులు, ఆయుధ సామగ్రితో ఇరాన్పై దాడి చేయడంతో ఇరాన్ అగ్రనాయకత్వం కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ దాడి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. “ఒక్క దెబ్బకు 48 మంది ఇరాన్ అగ్రనేతలను లేపేశాం.. ఇది మాకు అద్భుత విజయం” డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటన చేశారు. అమెరికా- ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతంగా కొనసాగుతోందని.. ఊహించిన దానికంటే వేగంగా ముందుకెళ్తున్నామని అన్నారు. ఏది కరెక్టో అదే చేస్తున్నానన్న ట్రంప్.. అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ నేతలు ముందుకు వచ్చారని చెప్పారు. అందుకు తాను అంగీకరించానని.. వాళ్లు ఈ పని ముందే చేయాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే ఇరాన్ ఒకవేళ ప్రతీకారానికి దిగితే, ఇంతకంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఇది తమ ఉనికి కోసం జరుగుతున్న యుద్ధమని మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఇరాన్పై దాడులను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ క్రమంలో ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్.. ఇజ్రాయెల్లోని బీట్ షెమెష్పై బాలిస్టిక్ మిస్సైల్స్తో దాడి చేసింది. ఈ ఘటనలో 8 మంది మరణించారు. మరోవైపు గల్ఫ్ జలాల్లోని ఇంధన ట్యాంకర్లే లక్ష్యంగా ఇరాన్ దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఓ ట్యాంకర్ పూర్తిగా మునిగిపోగా, మరొకటి ధ్వంసమైంది. ఈ ఘటనలో భారతీయులు కూడా గాయపడ్డారు. దుబాయ్, అబుదాబి, దోహా వంటి ప్రధాన నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
కాగా, ఖమేనీ మరణం తర్వాత ఇరాన్లో తాత్కాలిక పాలక మండలి ఏర్పాటు కాగా.. అయతోల్లా అలిరెజా అరాఫీని తాత్కాలిక సుప్రీం లీడర్గా వ్యవహరించనున్నారు. యుద్ధం కారణంగా గగనతలం మూసివేయడంతో విమానయాన రంగం డీలా పడింది. భారత్ నుంచి వెళ్లాల్సిన 50కి పైగా ఎయిర్ ఇండియా విమానాలు, ఢిల్లీ ఎయిర్పోర్టులో 100కు పైగా సర్వీసులు రద్దవడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ యుద్ధాన్ని రష్యా, చైనా చేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇది అంతర్జాతీయ చట్లాల ఉల్లంఘన అని పేర్కొంటున్నారు.
మరోవైపు, ఇరాన్పై అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో తొలిసారిగా ఆ దేశానికి ప్రాణనష్టం సంభవించింది. ఈ ఆపరేషన్లో తమ దేశానికి చెందిన ముగ్గురు సైనికులు మరణించారని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని అధికారికంగా ధ్రువీకరించింది.

