Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Earthquake : తుర్కియేలో భయానక భూకంపం... బాలికెసిర్‌లో భారీ ప్రకంపనలు!

Earthquake : తుర్కియేలో భయానక భూకంపం… బాలికెసిర్‌లో భారీ ప్రకంపనలు!

Turkey earthquake Balıkesir : గతేడాది గాయం ఇంకా పచ్చిగానే ఉంది… వేలాది మందిని పొట్టన పెట్టుకున్న పెను విషాదం నుంచి పూర్తిగా కోలుకోకముందే తుర్కియేను మరోసారి భూకంపం వణికించింది. జనం గాఢ నిద్రలో ఉన్న సమయంలో బలికెసిర్ ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించి, భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఈ ప్రకృతి ప్రకోపానికి జరిగిన నష్టమెంత? శిథిలాల కింద ఇంకా ఎంతమంది ప్రాణాలతో పోరాడుతున్నారు..? అసలు తరచూ భూకంపాల బారిన పడుతున్న తుర్కియేలో ఎందుకీ పరిస్థితి..? 

- Advertisement -

భూకంప కేంద్రం – నష్టం వివరాలు: తుర్కియే వాయువ్య ప్రాంతంలోని బలికెసిర్ ప్రావిన్స్‌లోని సిందిర్గి పట్టణం కేంద్రంగా ఈ భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైంది. ప్రకంపనల తీవ్రతకు భూకంప కేంద్రానికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్తాంబుల్ నగరం కూడా కంపించిపోయింది. టర్కిష్ మంత్రి అలీ యెర్లికాయ వెల్లడించిన వివరాల ప్రకారం, సిందిర్గి పట్టణంలో భూకంప ధాటికి 16 భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఈ ఘటనల్లో భవన శిథిలాల కింద చిక్కుకొని ఒక యువతి మృతి చెందగా, మరో 29 మంది గాయపడ్డారు. కూలిపోయిన ఒక మూడు అంతస్తుల భవనం నుంచి ఆరుగురిని సహాయక బృందాలు క్షేమంగా బయటకు తీసుకువచ్చాయి. అయితే, శిథిలాల నుంచి వెలికితీసిన 80 ఏళ్ల వృద్ధుడు కాసేపటికే మరణించినట్లు అధికారులు ధృవీకరించారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు: ప్రమాదం జరిగిన వెంటనే విపత్తు నిర్వహణ దళాలు హుటాహుటిన ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. శిథిలాలను తొలగిస్తూ, వాటి కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు అహోరాత్రులు శ్రమిస్తున్నాయి. మరోవైపు, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నానని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

వీడని భూకంపాల భయం: ప్రపంచంలో అత్యంత చురుకైన భూకంప జోన్లలో తుర్కియే ఒకటి కావడంతో, ఇక్కడ భూప్రకంపనలు సర్వసాధారణంగా మారాయి.

2023 పెను విషాదం: గతేడాది ఫిబ్రవరిలో దేశ నైరుతి ప్రాంతంలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు. ఆ పెను విపత్తుకు ఏకంగా 53,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా, చారిత్రక నగరాలు సైతం నేలమట్టమయ్యాయి.

ఇటీవలి ఘటనలు: జులైలో అదే ప్రాంతంలో 5.8 తీవ్రతతో వచ్చిన భూకంపానికి ఒకరు మరణించగా, 69 మంది గాయపడ్డారు. ఈ వరుస ఘటనలతో తుర్కియే ప్రజలు నిత్యం భయం నీడలో బతుకుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad