Gandhi Hospital: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత మధ్యప్రాచ్యంలో ఆగ్రహ జ్వాలలు కట్టలు తెంచుకుంది. అమెరికా-ఇజ్రాయెల్ కూటమి సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’లో భాగంగా సోమవారం తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్పై క్షిపణుల వర్షం కురిసింది. ఈ దాడుల్లో ఉత్తర టెహ్రాన్లోని ప్రసిద్ధ గాంధీ ఆసుపత్రి (Gandhi Hospital) తీవ్రంగా దెబ్బతినడంతో భారీగా నష్టం చోటుచేసుకుంది.
ఆసుపత్రిలో భీకర దృశ్యాలు: వైద్య సేవలందించే పవిత్ర నిలయం ఒక్కసారిగా యుద్ధభూమిని తలపించింది. క్షిపణుల తాకిడికి ఆసుపత్రి భవనం పై అంతస్తులు కుప్పకూలిపోయాయి. దట్టమైన పొగ వార్డులను ముంచెత్తడంతో రోగులు ఊపిరాడక విలవిల్లాడారు. కిటికీలు పగిలి శిథిలాలు రోగుల పడకలపై పడటంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇరాన్ నర్సులు చూపిన సాహసం ప్రపంచాన్ని కదిలిస్తోంది. బాంబులు పడుతున్నా లెక్కచేయకుండా.. ఇన్సులేటర్లలో ఉన్న నవజాత శిశువులను, ఐసీయూలోని చిన్న పిల్లలను తమ చేతులతో పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అంతర్జాతీయంగా ఉద్రిక్తత: ఈ దాడిపై ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) స్పందిస్తూ.. తాము కేవలం ప్రభుత్వ భవనాలను, కమాండ్ సెంటర్లను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొంది. పౌరులకు హాని కలిగించడం తమ ఉద్దేశ్యం కాదని ప్రకటించింది. అయితే వైద్యం పొందుతున్న రోగులపై బాంబులు వేయడం అంతర్జాతీయ మానవతా నిబంధనల ఉల్లంఘన అని ఇరాన్ మీడియా మండిపడుతోంది.
Also read-Jerusalem: ఇరాన్ దాడితో దద్దరిల్లిన జెరూసలేం.. 8 మంది మృతి
ముదురుతున్న ముప్పు: ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలకు సిద్ధమని సంకేతాలిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం దాడులు ఆగడం లేదు. అయితే ఇరాన్ ప్రతిచర్యగా దుబాయ్, అబుదాబి, ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. గాంధీ ఆసుపత్రి ఘటనలో మరణించిన వారి సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రాణభయంతో టెహ్రాన్ వాసులు నగరాలను వదిలి వలస వెళ్తున్నారు.

