Vaccine for Hanta Virus: ప్రపంచవ్యాప్తంగా హాంటా వైరస్ భయాంధోళనలు సృష్టిస్తోంది. క్రూజ్ నౌక ఎంవీ హొండియస్లోని ప్రయాణికులు హంటావైరస్ బారిన పడటంతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. కరోనా మిగిల్చిన ప్రాణ నష్టాన్ని గుర్తు చేసుకుంటూ యావత్ ప్రపంచం భయాందోళనకు గురవుతోంది. ప్రధానంగా మనిషిలోని శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఈ వైరస్ కారణంగా మరణాల రేటు కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్కు వ్యాక్సిన్ కూడా లేకపోవడం మరింత ఆందోళనకరంగా మారింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే చికిత్సపై శాస్త్రవేత్తలు ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించారు. అయితే, హంటాకు దశాబ్దం క్రితమే వ్యాక్సిన్ రావాల్సి ఉండగా.. నిధుల కొరత కారణంగా నాటి ప్రయత్నాలు ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వ్యాక్సిన్ ప్రయోగాల్లో భాగమైన చిలీ శాస్త్రవేత్తలు అంతర్జాతీయ మీడియాతో నాటి తమ అనుభవాలను పంచుకున్నారు.
Also read: https://teluguprabha.net/andhra-pradesh-news/ap-cabinet-approves-investments-worth-rs-2-lakh-crore/
హ్యుమన్ ట్రయల్స్ కోసం 7 మిలియన్ల ఖర్చు..
చిలీలోని ఓ యూనివర్సిటీలో వైరాలజీ శాస్త్రవేత్త మరియా జోస్ బరియా నేతృత్వంలోని బృందం హంటా వైరస్పై అనేక ప్రయోగాలు చేపట్టింది. ముఖ్యంగా మనుషుల్లో ఒకరి నుంచి ఒకరికి సోకే ఆండిస్ అనే రకం హంటా వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీ సామర్థ్యాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2016లో వీరి పరిశోధనల్లో పురోగతి సాధించారు. జంతువులపై ఈ యాంటీబాడీలను పరీక్షించగా అవి సత్ఫలితాలనిచ్చాయి. తర్వాత మనుషులపై ప్రయోగాల కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ నిధుల కొరత కారణంగా ముందుకెళ్లలేకపోయామని శాస్త్రవేత్త మరియా జోస్ చెబుతున్నారు. అయితే, హ్యూమన్ ట్రయల్స్ కోసం దాదాపు 7 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని ఆమె అంచనా వేశారు. నిధుల కోసం ఎన్నో అంతర్జాతీయ సంస్థలను సంప్రదించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే కొవిడ్ మహమ్మరి వచ్చి తమ ప్రయత్నాలను ఆటంకం కలిగించిందని పేర్కొన్నారు. ఒకవేళ తక్షణమే నిధులు అందినా.. వ్యాక్సిన్పై ప్రయోగాలు పూర్తయ్యేందుకు కనీసం 12 నుంచి 24 నెలల సమయం పడుతుందని వివరించారు.
Also read: https://teluguprabha.net/national-news/work-from-home-2-days-a-week-in-delhi/
వైరస్ భారీన పడిన వారిలో 40 శాతం మంది మరణం..
సాధారణంగా ఈ హంటావైరస్లో 40 రకాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటిని ఓల్డ్ వరల్డ్, న్యూ వరల్డ్ అనే రెండు విభాగాలుగా విభజించారు. న్యూ వరల్డ్ వైరస్లు ఉత్తర, దక్షిణ అమెరికాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. చిలీలో ఏటా 40 నుంచి 60 వరకు హాంటా వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. వీటిలో మరణాల రేటు కూడా అధికంగా ఉంటోంది. వైరస్ భారీన పడిన వారిలో 40 శాతం మంది మరణిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది కూడా ఇప్పటికే 39 హంటా వైరస్ కేసులు నమోదవ్వగా.. 13 మరణాలు సంభవించాయి. దక్షిణ అర్జెంటీనాలోనూ 42 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో పాటు కొన్నిసార్లు తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇటీవల అర్జెంటీనా నుంచి బయల్దేరిన హొండియస్ నౌకలో పలువురు ఈ వైరస్ బారిన పడటంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. హాంటా వైరస్ భారీన పడిన వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, హుండియస్ నౌకలో వెలుగు చూసింది ప్రమాదకర ఆండిస్ రకం హంటా వైరస్ అని అధికారులు నిర్థారించారు. వైరస్ భారీన పడిన వ్యక్తికి సన్నిహితంగా మెలిగినప్పుడు ఇది వేగంగా వ్యాపిస్తుంది.

