18 Killed After Bus Hit By Massive Landslide in Himachal: హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో (landslide) ఒక ప్రైవేట్ బస్సు పూర్తిగా శిథిలాల కింద కూరుకుపోయింది. ఈ దుర్ఘటనలో కనీసం 18 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు.
ALSO READ: CJI attack : “సీజేఐపై దాడికి బాధలేదు.. ఆ వ్యాఖ్యలే బాధించాయి!”
సుమారు 30 నుంచి 35 మంది ప్రయాణికులతో హర్యానాలోని రోహ్తక్ నుంచి బిలాస్పూర్ సమీపంలోని ఘుమర్విన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఝండూత్తా అసెంబ్లీ నియోజకవర్గంలోని భల్లుఘాట్ ప్రాంతంలోని భల్లు వంతెన సమీపంలో బస్సు వెళ్తున్న సమయంలో, కొండ మొత్తం ఒక్కసారిగా బస్సుపై విరిగిపడింది.
పోలీసు అధికారుల సమాచారం ప్రకారం, బస్సుపై మొత్తం కొండ విరిగిపడటంతో శిథిలాల కింద కూరుకుపోయిన ప్రయాణికులు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు జేసీబీ యంత్రాలు, స్థానిక రెస్క్యూ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. రక్షించబడిన ముగ్గురు పిల్లలను బిలాస్పూర్ సమీపంలోని బెర్తిన్ ఆసుపత్రికి తరలించారు.
ప్రధాని, సీఎం, కేంద్ర మంత్రి సంతాపం
ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పీఎం జాతీయ సహాయ నిధి (PM National Relief Fund) నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారాన్ని ప్రకటించారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని పీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని తెలిపారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు.


