50 years of Emergency: స్వాతంత్ర భారతదేశంలో ఎమర్జెన్సీ రోజులు చీకటి రోజులుగా మిగిలిపోయాయి. 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించారు. నేటికీ ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఆనాటి సంగతులను అప్పటి నేతలు గుర్తుతెచ్చుకుంటున్నారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ ఆ కాలంలో బలమైన నేతగా ఉండేవారు. ఆమె ముందు నిలబడాలన్నా మేటి కాంగ్రెస్ నేతలు కూడా వణికిపోయారు. అంతలా ఇందిరా పార్టీపై బలం పెంచుకుంది. పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ ఆమె చెప్పిందే వేదం. ఆమె చేసేదే శాసనం.
అప్పటికే కాంగ్రెస్ విధానాలు, ఇందిరా గాంధీ నియంతృత్వ పోకడలకు ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ సమయంలోనూ ఇందిరా గాంధీ బ్యాంకుల జాతీయికరణ, రాజభరణాల రద్దు వంటి కీలక నిర్ణయాలతో పాలన సాగిస్తున్నారు. ఇదే సమయంలో పాకిస్థాన్ దేశంతో యుద్ధం చేసి బంగ్లాదేశ్ ను ప్రత్యేక దేశంగా ప్రకటించడంతో ఆమె కీలక పాత్ర పోషించారు. దీంతో ఆమె ప్రతిష్ట తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో 1971లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. పశ్చిమబెంగాల్ లో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
దేశంలో ఇందిరా గాంధీ పాలనకు అడ్డుచెప్పే వారే కరవయ్యారు. అయితే క్రమేణా ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతి వంటి కారణాలతో ప్రజల్లో నిరసనలు ఊపందుకున్నాయి. 1974లో రైల్వే సమ్మె, బీహార్లో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం దేశాన్ని కుదిపేశాయి. దీంతో కొన్ని పార్టీలు కలిసి జనసంఘ్ గా ఏర్పడ్డాయి. ఈ సమయలోనే రాయబరేలీ నుంచి ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదంటూ ఆమె ప్రత్యర్థి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని బెదిరింపులతో ఆమె గెలిచారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిన్హా ఆమె ఎన్నిక చెల్లదని తీర్పునివ్వడం సంచలనంగా మారింది. కోర్టు తీర్పుతో ఆగ్రహంతో రగిలిపోయిన ఇందిరా గాంధీ 1975 జూన్ 25 అర్థరాత్రి ఎమర్జెన్సీ విధించారు. 1977 మార్చి 21 వరకు ఎమర్జెన్సీ పాలన సాగింది. ఈ సమయంలో ప్రతిపక్షనేతలు, వామపక్ష నాయకులు, సామాన్య ప్రజలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ప్రజా ఆగ్రహంతో ఎట్టకేలకు ఎమర్జెన్సీ తొలగించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.
ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం వద్ధ పోస్టర్లు వెలిశాయి. ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇవాళ సాయంత్రం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.