టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషి శ్రమ పడటం తగ్గిపోతూ ఉంది. ఒకప్పుడు సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే సొంత వాహనాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడేవారు. అయితే ర్యాపిడో, ఓలా రైడ్ బైక్స్, క్యాబ్ సర్వీసులు వచ్చాక సులువుగా బుక్ చేసుకుని గమ్యానికి చేరిపోతున్నాం. దీంతో వీటి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. ఓలా, ఉబర్, ర్యాపిడోలకు ఆదరణ పెరగడంతో చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. కానీ నడిచి రెండు నిమిషాల్లో వెళ్లే గమ్యానికి కూడా ఓ యువతి బైక్ రైడ్ బుక్ చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన ఓ యువతి ఇంటికి వెళ్లేందుకు ఓలా బైక్ రైడ్ బుక్(Ola Bike Ride)చేసుకుంది. దీంతో పిక్ చేసుకునేందుకు బైక్ రైడర్ లోకేషన్కు వచ్చాడు. ఆ యువతి ఓటీపీ చెప్పగానే డ్రాపింగ్ పాయింట్ లోకేషన్ చూపించింది. అది చూసిన రైడర్ షాక్ అయ్యాడు. కేవలం 180 మీటర్ల దూరమే డ్రాపింగ్ పాయింట్ ఉండటంతో ఆశ్చర్యపోయాడు.
ఇంత తక్కువ దూరానికే ఎందుకు బుక్ చేసుకున్నారని రైడర్ అడిగితే ఆ యువతి సమాధానం విని షాక్ అయ్యాడు. ఈ ఏరియాలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని.. అందుకే రైడ్ బుక్ చేసుకున్నా అని తెలిపింది. అనంతరం ఆ రైడర్ ఆ అమ్మాయిని బైక్పై ఎక్కించుకొని గమ్యస్తానానికి చేర్చాడు. కాగా ఆ యువతి అంత తక్కువ దూరానికి రూ. 19 బిల్లు చెల్లించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.