Wednesday, February 18, 2026
Homeనేషనల్Condolence : మహారాష్ట్రలో విషాద ఛాయలు.. అజిత్ పవార్ అకాల మృతిపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

Condolence : మహారాష్ట్రలో విషాద ఛాయలు.. అజిత్ పవార్ అకాల మృతిపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

Ajit Pawar Death Reactions : మహారాష్ట్ర రాజకీయ యవనికపై విషాద మేఘాలు కమ్ముకున్నాయి. బారామతి గడ్డపై జరిగిన ఘోర విమాన ప్రమాదం ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, సీనియర్ నేత అజిత్ పవార్‌ను బలితీసుకోవడం యావత్ దేశాన్ని కలచివేసింది. అలుపెరగని ప్రజాసేవకుడిగా, పరిపాలనా దక్షుడిగా పేరుగాంచిన అజిత్ పవార్ అకాల మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన సేవలను కొనియాడారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఒక నాయకుడిని కోల్పోవడం పట్ల ప్రముఖులు వెలిబుచ్చిన ఆవేదన, అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానంపై వారు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. పూర్తి వివరాలు..

- Advertisement -

తీరని లోటు.. సహకార రంగం ఆయన్ను మరువదు: రాష్ట్రపతి : అజిత్ పవార్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని అత్యంత బాధాకరమైన ఘటనగా అభివర్ణించారు. “బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా పలువురు మరణించడం నా హృదయాన్ని కలచివేసింది. ఆయన మరణం దేశ రాజకీయాలకు, ముఖ్యంగా మహారాష్ట్రకు తీరని లోటు,” అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలోనూ, ముఖ్యంగా సహకార రంగం  బలోపేతంలోనూ అజిత్ పవార్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. శోకసంద్రంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.

ప్రజల మనిషి.. పరిపాలనా దక్షుడు: ప్రధాని మోదీ : అజిత్ పవార్‌ను ‘ప్రజల నాయకుడి’గా (Mass Leader) అభివర్ణిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎమోషనల్ పోస్ట్ చేశారు. అట్టడుగు వర్గాలతో అజిత్ పవార్‌కు ఉన్న అనుబంధాన్ని ప్రధాని గుర్తుచేసుకున్నారు. “అజిత్ పవార్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ప్రజలతో మమేకమైన వ్యక్తి. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు,” అని మోదీ ప్రశంసించారు. పరిపాలనా వ్యవహారాలపై అజిత్ పవార్‌కు ఉన్న పట్టు, పేదలు మరియు అణగారిన వర్గాల సాధికారత పట్ల ఆయనకున్న అంకితభావాన్ని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ఆయన అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. ఓం శాంతి,” అని ప్రధాని ట్వీట్ చేశారు.

వెల్లువెత్తుతున్న సంతాపం : కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు అజిత్ పవార్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News