Sunday, February 8, 2026
Homeనేషనల్Funeral : అశ్రు సంద్రం.. 'దాదా'కు అంతిమ వందనం! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు

Funeral : అశ్రు సంద్రం.. ‘దాదా’కు అంతిమ వందనం! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు

Ajit Pawar Last Rites : మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని విషాదం మిగిల్చిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంతిమ యాత్ర కన్నీటి పర్యంతమైంది. విమాన ప్రమాదంలో ఆకస్మికంగా మరణించిన తమ ప్రియతమ నేతను కడసారి చూసుకునేందుకు బారామతి జనసంద్రంగా మారింది. “దాదా.. ఇక లేరా?” అంటూ వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు బావురుమన్నారు. రాజకీయ ఉద్ధండులు, కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రుల సమక్షంలో.. ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. విద్యాప్రతిష్ఠాన్ మైదానం ఉద్విగ్నభరిత వాతావరణంతో నిండిపోయింది. 

- Advertisement -

స్వగ్రామం నుంచి విద్యాప్రతిష్ఠాన్ వరకు : గురువారం ఉదయం నుంచే బారామతిలో విషాదఛాయలు అలుముకున్నాయి. అజిత్ పవార్ పార్థివదేహాన్ని తొలుత బారామతిలోని అహల్యాదేవి ఆసుపత్రి నుంచి ఆయన స్వగ్రామమైన కాటేవాడికి తరలించారు. అక్కడ స్థానికులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం ప్రత్యేక అంబులెన్స్‌లో భౌతికకాయాన్ని జేడీ మాడ్గుల్కర్‌ ఆడిటోరియానికి తీసుకువచ్చారు. అక్కడ ప్రజల సందర్శనార్థం కొంతసేపు ఉంచిన తర్వాత.. అంతిమ సంస్కారాల కోసం విద్యాప్రతిష్ఠాన్ మైదానానికి తరలించారు. దారి పొడవునా అభిమానులు పూల వర్షం కురిపిస్తూ, నినాదాలతో తమ నాయకుడిని సాగనంపారు.

రాజకీయ దిగ్గజాల నివాళి : అజిత్ పవార్‌ ఆకస్మిక మృతితో మహారాష్ట్ర రాజకీయాల్లోని అగ్రనేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి నివాళులర్పించారు. అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరై పాడె మోసి నివాళి అర్పించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, మరో ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే కన్నీటి పర్యంతమయ్యారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, కుటుంబ బంధాన్ని గౌరవిస్తూ మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఎంఎన్‌ఎస్ అధినేత రాజ్‌ ఠాక్రే కూడా హాజరై పవార్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. శరద్ పవార్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కలచివేసింది.

ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు : విద్యాప్రతిష్ఠాన్ మైదానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కుటుంబ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు జరిగాయి. అజిత్ పవార్ మృతికి సంతాప సూచకంగా మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఈ మూడు రోజులూ రాష్ట్రంలో ఎలాంటి అధికారిక వేడుకలు జరగవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక సమర్థవంతమైన నాయకుడిని కోల్పోయామని, ఈ లోటు పూడ్చలేనిదని పలువురు నేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News