Allahabad High Court Quashes POCSO Case Against Couple: ప్రేమించి పెళ్లి చేసుకుని, సంతోషంగా కాపురం చేసుకుంటున్న ఓ జంటకు పెద్ద ఉపశమనం కలిగించింది అలహాబాద్ హైకోర్టు. భార్యాభర్తలుగా మారిన ఆ జంటపై ఉన్న పోక్సో కేసు (POCSO Case )ను కొట్టివేసింది. చట్టం అనేది సమాజంలో సమస్యలు సృష్టించడానికి కాదు, పరిష్కారాలు చూపడానికని కోర్టు తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
ప్రతి కంట కన్నీరు తుడవడమే విధి
“ప్రతి కంట కన్నీరు తుడవడమే న్యాయమూర్తి పవిత్ర విధి” అని జస్టిస్ క్షితిజ్ శైలేంద్ర (Justice Kshitij Shailendra) వ్యాఖ్యానించారు. సంతోషంగా ఉన్న దంపతులను కేవలం సాక్ష్యం కోసం కోర్టుల చుట్టూ తిప్పడం, విచారణ పేరుతో వేధించడం విధి వెక్కిరింతే (Irony of fate) అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తన భర్తను నిర్దోషిగా విడుదల చేయించుకోవడానికి ఒక భార్య నెలల తరబడి కోర్టు మెట్లు ఎక్కడం, తనకు ఇష్టం లేని ఆరోపణలపై సంజాయిషీ ఇచ్చుకోవడం అంటే.. అది చట్టబద్ధమైన వేధింపు కిందకే వస్తుందని కోర్టు ఘాటుగా స్పందించింది. న్యాయం కోసం బాధితులు ఎదురుచూస్తున్నప్పుడు కోర్టు మౌన ప్రేక్షక పాత్ర పోషించకూడదని స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే?
అసలు కథ ఏంటంటే.. 2024 ఏప్రిల్లో ఓ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశ్వని ఆనంద్ అనే వ్యక్తి తన కూతురిని కిడ్నాప్ చేశాడని ఆరోపించారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. కానీ, ఆ యువతి మాత్రం పోలీసుల విచారణలో తండ్రి ఆరోపణలను పూర్తిగా ఖండించింది. తాను ఎవరి బలవంతం లేకుండా, స్వష్టంగా తన ఇష్టపూర్వకంగానే ఇంటి నుంచి వెళ్లానని స్పష్టం చేసింది. అంతేకాదు, ఆ సమయంలో నిందితుడితో ఎలాంటి శారీరక సంబంధం పెట్టుకోలేదని కూడా చెప్పింది.
భర్తపై కేసు వద్దన్న భార్య
ప్రస్తుతం ఆ యువతి, తనపై నిందలు పడ్డ అశ్వని ఆనంద్నే పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తోంది. భర్తపై ఉన్న ఎఫ్ఐఆర్ (FIR)ను రద్దు చేయాలని ఆమె స్వయంగా కోర్టును ఆశ్రయించింది. తన తండ్రి పెట్టిన కేసులో నిజం లేదని వాదించింది. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, ఈ కేసును కొనసాగించడం వల్ల ఆ కొత్త జంట కాపురంలో చిచ్చు పెట్టినట్లవుతుందని భావించింది. అందుకే అశ్వని ఆనంద్పై ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ను రద్దు చేస్తూ నవంబర్ 21న తీర్పు వెలువరించింది.

