Saturday, November 15, 2025
Homeనేషనల్Amit Shah : భారత్ జోలికొస్తే బడితపూజే.. ఉగ్రవాదులకు 'మహాదేవ్' రుచి చూపించామన్న అమిత్ షా!

Amit Shah : భారత్ జోలికొస్తే బడితపూజే.. ఉగ్రవాదులకు ‘మహాదేవ్’ రుచి చూపించామన్న అమిత్ షా!

Amit Shah’s strong message to terrorists : “భారత పౌరుల జోలికి వస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఉగ్రవాదులకు రుచి చూపించాం.” – ఇది కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ఉద్వేగభరితమైన, ఘాటైన హెచ్చరిక. ‘ఆపరేషన్ సిందూర్’ దేశ ప్రజల్లో సంతృప్తిని నింపితే, ‘ఆపరేషన్ మహాదేవ్’ ఆ సంతృప్తిని తిరుగులేని విశ్వాసంగా మార్చిందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. 

- Advertisement -

పహల్గాం నెత్తుటి గాయం: ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. హిందూ యాత్రికులనే లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ కిరాతక దాడిలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానిక కశ్మీరీ ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలను రగిలించింది.

‘ఆపరేషన్ సిందూర్’తో తొలి దెబ్బ: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను మన సైన్యం ధ్వంసం చేసింది. ఈ మెరుపు దాడుల్లో వందకు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో కంగుతిన్న పాకిస్థాన్, సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడినా, భారత త్రివిధ దళాల ధాటికి తలొగ్గి తోక ముడవక తప్పలేదు.

‘ఆపరేషన్ మహాదేవ్’తో ప్రతీకారం పూర్తి: ‘ఆపరేషన్ సిందూర్’ బాహ్య శత్రువుల పని పడితే, ‘ఆపరేషన్ మహాదేవ్’ దేశంలో దాగి ఉన్న ద్రోహుల భరతం పట్టింది. పహల్గాం మారణహోమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఉగ్రవాదులను ఏరిపారేయడమే లక్ష్యంగా మన భద్రతా దళాలు ఈ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. జులైలో జరిగిన ఈ ఆపరేషన్‌లో, పహల్గాం దాడికి పాల్పడిన ప్రతి ఉగ్రవాదిని మన సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది మట్టుబెట్టారు.

ఉగ్రవాదులకు స్పష్టమైన సందేశం: ఈ చారిత్రక విజయంపై స్పందించిన హోంమంత్రి అమిత్ షా, ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా సిబ్బందిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆపరేషన్ సిందూర్, ఆపరేషన్ మహాదేవ్.. ఈ రెండూ భారత పౌరుల జీవితాలతో ఆడుకుంటే కలిగే పరిణామాల గురించి ఉగ్రవాద సూత్రధారులకు స్పష్టమైన సందేశాన్ని పంపాయి,” అని గర్జించారు. కశ్మీర్‌లో పర్యాటకాన్ని దెబ్బతీసి, ‘కశ్మీర్ మిషన్’ను పట్టాలు తప్పించాలన్న ఉగ్రవాదుల కుట్రలను మన భద్రతా దళాలు భగ్నం చేశాయని ఆయన కొనియాడారు.

ఎన్ఐఏ ఫోరెన్సిక్ నిర్ధారణ: ‘ఆపరేషన్ మహాదేవ్’లో హతమైన ఉగ్రవాదులు, పహల్గాంలో మారణహోమం సృష్టించిన వారేనని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించడం ఈ ఆపరేషన్ విజయానికి శాస్త్రీయ ముద్ర వేసింది. ఈ నిర్ధారణతో భారత భద్రతా దళాల పనితీరుపై దేశ ప్రజల్లో విశ్వాసం మరింత బలపడింది. “భారత పౌరుల హృదయాల్లో భద్రతా భావాన్ని పటిష్ఠం చేసిన మన దళాలకు ప్రధాని మోదీ తరఫున, యావత్ దేశం తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను,” అని అమిత్ షా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad