జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో(Pahalgam Terror attack) ప్రాణాలు కోల్పోయిన మృతులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah), లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నివాళులు అర్పించారు. శ్రీనగర్లోని పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నివాళులు అర్పించిన అనంతరం అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి దాడి జరిగిన బైసరన్ ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు. ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్ లోయ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు భారీగా భద్రతా బలగాలను మోహరించారు. మరోవైపు దాడికి నిరసనగా కశ్మీర్ వ్యాప్తంగా సంపూర్ణ బంద్ కొనసాగుతోంది. శ్రీనగర్తో సహా అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల్లో దుకాణాలు, విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి.