Annamalai sensational decision: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. తమిళనాడు బీజేపీ బిగ్షాక్ తగిలింది. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం కృషి చేసిన మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ను కలిసిన ఆయన, ఐదు పేజీల తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయి రాజీనామా దారితీసిన పరిస్థితులను వివరించారు. అనంతరం నేరుగా చెన్నైకి పయనమయ్యారు. తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అన్నామలైని తొలగించి, ఆయన స్థానంలో నైనార్ నాగేంద్రన్ను నియమించినప్పటి నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నారు. గత ఎన్నికల్లోనూ ఆయనకు ప్రాధాన్యత ఇవ్వలేదు, ఎమ్మెల్యే టికెట్ను కూడా ఇవ్వకపోవడం ఆయన్ను తీవ్రంగా కలిచివేసింది. దీంతో, ఆయన గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. బీజేపీలో తనకు భవిష్యత్తు లేదని భావించే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
పార్టీలో తగిన ప్రాధాన్యం లేనందుకే..
పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్లతో జరిగిన కీలక సమావేశంలో అన్నామలై తన రాజీనామా లేఖ సమర్పించారు. పార్టీ నుంచి ఎలాంటి గొడవలు లేకుండా మర్యాదపూర్వకంగానే బయటకు వెళ్లాలని చెప్పారు. ఇకపై తన సొంత దారి తాను చూసుకుంటానని స్పష్టం చేశారు. అయితే, అన్నామలై లాంటి బలమైన నేతను వదులుకోవడానికి బీజేపీ ఇష్టపడటం లేదు. ఆయనను బుజ్జగించి పార్టీలోనే ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ఆయనకు జాతీయ స్థాయిలో ఒక పెద్ద పదవి ఇవ్వాలని కూడా అధిష్టానం ఆలోచిస్తోంది. అందుకే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఢిల్లీ వదిలి వెళ్లవద్దని కూడా అన్నామలైకి మొదట సూచించినట్లు సమాచారం. 2020లో ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలై.. తమిళనాడు బీజేపీకి అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు పార్టీని వీడుతున్న ఆయన, ప్రజల కోసం ఒక కొత్త ఉద్యమాన్ని లేదా వేదికను ప్రారంభించాలని చూస్తున్నారట. భవిష్యత్తులో అది రాజకీయ పార్టీగా మారుతుందా లేదా అనేది సస్పెన్స్గా మారింది.

