Freedom of religion: భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా పార్లమెంటులో జరుగుతున్న చర్చకు జమియత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ చేసిన వ్యాఖ్యలు కొత్త మలుపునిచ్చాయి. ముస్లింలు ఈ గీతాన్ని పాడటాన్ని అభ్యంతర పెట్టకపోయినా, దాని సారాంశం ఇస్లామిక్ ఏకత్వ సిద్ధాంతానికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో మదానీ చేసిన ఎక్స్ పోస్ట్ దేశభక్తి, మత విశ్వాసాల మధ్య గల సున్నితమైన అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. “ఎవరైనా ‘వందేమాతరం’ ఆలపించినా, పాడినా మాకు అభ్యంతరం లేదు. అయితే.. ఒక ముస్లిం ఒక్క అల్లాను మాత్రమే ఆరాధిస్తాడు” అని ఎక్స్ పోస్టులో తెలిపారు.
విశ్వాసాలకు విరుద్ధం:
వందేమాతరం గేయంలోని నాలుగు చరణాల్లో మాతృభూమిని దేవతగా, దుర్గామాతతో పోల్చడాన్ని మదానీ ప్రస్తావించారు. “వందేమాతరం” అనే పదానికి అర్థం ‘తల్లి, నేను నిన్ను ఆరాధిస్తున్నాను’ అని, ఇది ముస్లింల ఏకదైవారాధన (తౌహీద్) సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధమని ఆయన అందులో పేర్కొన్నారు. అందుకే మత విశ్వాసాలకు విరుద్ధమైన నినాదాన్ని లేదా పాటను బలవంతంగా పాడమని ఎవరినీ ఒత్తిడి చేయకూడదని మదానీ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని అధికరణలు 25 (మత స్వేచ్ఛ), 19 (భావ ప్రకటనా స్వేచ్ఛ) ప్రతి పౌరుడికి ఈ స్వేచ్ఛను కల్పిస్తున్నాయని గుర్తుచేశారు.
also read Vijay Puducherry: భద్రతా ఏర్పాట్లపై పుదుచ్చేరికి ప్రశంసలు.. తమిళనాడుకి చురకలు అంటించిన విజయ్
దేశభక్తికి ధృవీకరణ అవసరం లేదు:
మాతృభూమిపై ప్రేమ చూపడం వేరు.. దాన్ని ఆరాధించడం వేరు అని మదానీ స్పష్టం చేశారు. దేశభక్తికి ముస్లింలకు ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదని, స్వాతంత్ర్య పోరాటంలో వారి త్యాగాలు చరిత్రలో మెరుస్తున్నాయని అన్నారు. “అల్లా తప్ప మరెవరినీ ఆరాధనకు అర్హులుగా అంగీకరించం. దైవారాధనలో బహుదేవతారాధనను అంగీకరించే బదులు మరణాన్ని స్వీకరిస్తాం” అని ప్రకటించారు.
ప్రధాని మోదీ సోమవారం కాంగ్రెస్ పార్టీ, నెహ్రూపై చేసిన విమర్శల నేపథ్యంలో మదానీ వ్యాఖ్యలు రావటం పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. నెహ్రూ ముహమ్మద్ అలీ జిన్నా అభ్యంతరాల మేరకు ‘వందేమాతరం’ను ముక్కలు చేసి, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డారని మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మౌలానా మదానీ వ్యాఖ్యలు జాతీయత, మతపరమైన హక్కుల అంశంపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి.

