Nara Lokesh: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గోవా రాష్ట్ర గవర్నర్ గా సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతి రాజును నియమించారు. గోవా రాష్ట్ర గవర్నర్గా అశోక్ గజపతి రాజు, తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ బంగ్లా దర్బార్ హాల్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆయన తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసారు.
అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మంత్రులు లోకేష్, గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్నాయుడు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఇతర టీడీపీ ఎంపీలు, నేతలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముందుగానే అపాయింట్ మెంట్లు తీసుకుని తెలుగు వారు భారీగా హాజరయ్యారు. ప్రమాణస్వీకారాన్ని నేరుగా తిలకించారు. గవర్నర్ గా అశోక్ గజపతిరాజును ఛీఫ్ జస్టిస్ అభినందించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఇవాళ సింగపూర్ పర్యటన కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.
నాలుగు దశాబ్దాల కాలంలో అశోక్ గజపతి రాజు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, ఎంపీ, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ సీఎం చంద్రబాబు సిఫార్సుతో అశోక్ గజపతి రాజును కేంద్రం గోవా గవర్నర్ గా నియమించింది. ఈ కార్యక్రమానికి హాజరైన నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
Readmore:https://teluguprabha.net/national-news/special-trains-for-simhastha-kumbh-mela/
నేడు గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యాను. అశోక్ గజపతిరాజుని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గోవా సీఎం ప్రమోద్ సావంత్ ని కూడా మర్యాదపూర్వకంగా కలిశాను అంటూ లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.

