Mamata Banerjee Comments over PM Modi: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ టీఎంసీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. మమతాబెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ కేవలం 80 సీట్లకే పరిమితం కాగా.. 200కి పైగా స్థానాలను బీజేపీ కైవసం చేసుకుని ఈ నెల 9న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఓట్లను చోరీ చేశారని.. తాము ఎన్నికల్లో ఓడిపోలేదని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం పదవికి తాను రాజీనామా చేయబోయేది లేదని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.
‘సీఎం పదవికి నేను రాజీనామా చేయను. లోక్భవన్కు వెళ్లను. గవర్నర్కు రాజీనామా లేఖ ఇవ్వను. మేం ఎన్నికల్లో ఓడిపోలేదు. గెలిచాం. నేను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు. మా ఓట్లను చోరీ చేశారు.’ -మమతా బెనర్జీ
ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్రించారు. బీజేపీకి ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేయడం అలవాటేనని మండిపడ్డారు. బీజేపీ కుట్రల వల్ల ఫలితాలు తారుమారు అయ్యాయని.. వందకుపైగా సీట్లను చోరీ చేసిందని విమర్శించారు. ప్రధాని మోదీ, కేంద్ర హో మంత్రి అమిత్ షా కనుసన్నల్లోనే ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందని ఆరోపించారు. తమకు ఇండియా బ్లాక్ మద్దతు ఉందని.. విలన్లపై పోరాటం చేశామని వెల్లడించారు. ఎన్నికల ఫలితాల్లో కేంద్ర ఎన్నికల సంఘమే అతిపెద్ద విలన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

