హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లి ఓ జంట అదృశ్యమైన కేసులో(Meghalaya murder case) ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది. భర్త రాజా రఘువంశీని భార్య సోనమ్(Sonam) సుఫారీ ఇచ్చి చంపించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా భార్య కోసం గాలిస్తున్న పోలీసుల ఎదుట ఆమె అనూహ్యంగా లొంగిపోయింది. విచారణలో భర్తను చంపించింది తానేనని చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. ఈ మొత్తం ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి మేఘాలయ పోలీసులు సోనమ్ సహా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజారఘువంశీ, సోనమ్ దంపతులకు మే 20న వివాహం జరిగింది. అనంతరం హనీమూన్ కోసం మే 22న మేఘాలయ వెళ్లారు. ఆ తర్వాత మే 23వ తేదీ నుంచి ఈ జంట కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టడం ప్రారంభించారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. మే 22వ తేదీ ఓ హోటల్ లో దిగినట్లు గుర్తించారు. అనంతరం కాసేపటికే హోటల్ నుంచి బయటకు వచ్చి రెంట్ కు తీసుకున్న స్కూటీపై బయటకు వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు దిగింది.
ఈ క్రమంలోనే ఓ జలపాతం వద్ద లోయలో భర్త రఘువంశీ మృతదేహం గుర్తించారు. కనిపించకుండా పోయిన భార్య సోనమ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మిస్సింగ్ కేసుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు సోనమ్ కిరాయి హంతకులను పూరమయించిందని గుర్తించారు. భార్యే హంతకురాలు అని తెలియడం తీవ్ర కలకలం రేపుతోంది.
మేఘాలయ డీజీపీ ఇదాషిషా నోంగ్రాంగ్ ఈ కేసుకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. రఘువంశీ హత్య కేసులో భార్య సోనమ్ సహా నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఆమెను యూపీలోని ఘాజీపూర్లోని వన్ స్టాప్ సెంటర్లో ఉంచారని పేర్కొన్నారు.
ఇక ఈ కేసు గురించి మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ట్వీట్ చేశారు.. రాజా రఘువంశీ హత్య కేసు ఛేదించడంలో మేఘాలయ పోలీసులు పెద్ద విజయం సాధించారని తెలిపారు. భార్యతో పాటు హత్య చేసిన ముగ్గురిని అరెస్ట్ చేశారని.. పరారీలో ఉన్న మరొకరి కోసం తీవ్రంగా గాలింపు చేస్తున్నారని వెల్లడించారు.