Saturday, November 15, 2025
HomeTop StoriesBihar Elections : 16 సార్లు ఓటమి.. 3 సార్లే డిపాజిట్టు.. 17వ సారి సై...

Bihar Elections : 16 సార్లు ఓటమి.. 3 సార్లే డిపాజిట్టు.. 17వ సారి సై అంటున్న నేత!

Perennial election candidate : ఎన్నికలంటేనే గెలుపోటముల సయ్యాట. కానీ కొందరికి అది ఒక వ్యసనం, మరికొందరికి ప్రజాసేవకు అలుపెరుగని పోరాటం. ఓటమి పలకరించినా వెనకడుగు వేయని ఓ నేత ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. ఏకంగా 16 సార్లు ఎన్నికల బరిలో నిలిచి, ఇప్పుడు 17వ సారికి సిద్ధమవుతున్నారు. అసలు ఎవరీ నేత? ఓటములు వెక్కిరిస్తున్నా ఆయన పట్టుదల వెనుక ఉన్న బలమేంటి? సొంత తల్లిపైనే పోటీ చేసిన ఈ విలక్షణ రాజకీయ యోధుడి కథేంటి?

- Advertisement -

బిహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వేడి రాజుకుంది. అధికార, విపక్ష కూటములు వ్యూహప్రతివ్యూహాలతో హోరెత్తిస్తుంటే, ముజఫర్‌పుర్‌ జిల్లా సాహెబ్‌గంజ్‌కు చెందిన డాక్టర్ మొహమ్మద్ నబీ హసన్ తన ప్రత్యేకతతో వార్తల్లో నిలుస్తున్నారు. వృత్తిరీత్యా ఇంటీరియర్ డెకరేటర్ అయినప్పటికీ, ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలను ఎంచుకున్న ఆయన, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు గతంలో 16 సార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. గెలుపు అందని ద్రాక్షలా ఊరిస్తున్నా, ఆయనలో ఉత్సాహం మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు.

అలుపెరుగని పోరాటం.. ఆసక్తికర ప్రస్థానం: నబీ హసన్ రాజకీయ ప్రస్థానం అనేక మలుపులతో నిండి ఉంది. ఆయన నిబద్ధతకు, పట్టుదలకు నిలువుటద్దంలా నిలుస్తుంది.
తొలి అడుగులోనే విజయం: 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు.

తల్లితోనే పోటీ: రాజకీయాల్లో అరుదైన ఘట్టంగా, 2008, 2013 మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆయన తన తల్లి జయబున్నీ సాహ్‌పైనే పోటీ చేశారు. అయితే ఈ పోటీ కేవలం స్నేహపూర్వకమేనని, కుటుంబ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఆయన చెబుతారు. 2013లో ఆయన ఓడిపోగా, తల్లి విజయం సాధించారు.

గెలుపోటముల పరంపర: 2010, 2020లలో అసెంబ్లీ ఎన్నికల్లో, 2014లో వైశాలీ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయినప్పటికీ, 2014 లోక్‌సభ ఎన్నికల్లో 22,455 ఓట్లు సాధించడం విశేషం.

మళ్లీ పుంజుకుని: తల్లి రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత, 2018లో మున్సిపాలిటీ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించారు.

“ప్రజల మధ్యకు వెళ్లి అభివృద్ధి పనులపై దృష్టి సారించడమే నా లక్ష్యం. 2020లో సాహిబ్‌గంజ్ నుంచి పోటీ చేసి ఓడిపోయాను. 2022లో వార్డ్ ఛైర్మన్ పదవికి నామినేషన్ వేసినా, కౌంటింగ్‌కు ముందే ఎన్నిక రద్దయింది,” అని నబీ హసన్ తన ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన ప్రయాణం, ఎన్నో ఎన్నికల్లో పోటీ చేసి “ధర్తీ పకడ్”గా పేరుగాంచిన కాకా జోగిందర్ సింగ్‌ను, తమిళనాడుకు చెందిన పద్మరాజన్‌ను గుర్తుకు తెస్తుంది.

17వ సారి బరిలోకి.. ఫీడ్‌బ్యాక్‌తో ముందుకు : రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సాహెబ్‌గంజ్ స్థానం నుంచి 17వ సారి పోటీ చేసేందుకు నబీ హసన్ సిద్ధమవుతున్నారు. “ఈసారి కూడా పోటీ చేయాలని భావిస్తున్నాను. నా బృందం ఇప్పటికే ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. ఫీడ్‌బ్యాక్ సానుకూలంగా ఉంటే తప్పకుండా బరిలోకి దిగుతాను. ఈ పోటీ పదవి కోసం కాదు, ప్రజలకు సేవ చేసే అవకాశం,” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad