Bengal Legislative party Meeting: పశ్చిమ బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఈరోజు కోల్కతాలో జరగనుంది. అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరిశీలకుడిగా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన బీజేపీ.. రేపు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల అనంతర పరిణామాలు, శాంతిభద్రతల నిర్వహణపై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేయనుంది.
ఇదిలా ఉండగా.. రాష్ట్ర అసెంబ్లీని గవర్నర్ ఆర్.ఎన్.రవి రద్దు చేశారు. మరోవైపు ఎన్నికల ఫలితాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘తాను రాజీనామా చేయబోయేది లేదు.. గవర్నర్కి రాజీనామా లేఖను సమర్పించేది లేద’నే తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గవర్నర్ తన అధికారాన్ని వినియోగించుకుని అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకూ కొనసాగుతున్న దీదీ ప్రభుత్వానికి ముగింపు పలికారు.
ఇక, కొత్త ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మమతా బెనర్జీపై ఘన విజయం సాధించిన సువేందు అధికారి పేరునే బీజేపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. ఆయననే సీఎం పదవికి ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు సమావేశం అనంతరం సీఎం ఎవరనే అంశంపై స్పష్టత రానుంది.

