Saturday, November 15, 2025
Homeనేషనల్130th Constitutional Amendment Bill : పదవీ గండం తెచ్చే బిల్లు - బీజేపీ పక్కా...

130th Constitutional Amendment Bill : పదవీ గండం తెచ్చే బిల్లు – బీజేపీ పక్కా స్కెచ్ ఇదేనా?

130th Constitutional Amendment Bill :  పార్లమెంట్లో మెజారిటీ లేదని తెలిసినా ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం వెనుక  అదీ ప్రధాని, ముఖ్యమంత్రుల పదవులకే ఎసరు పెట్టేంతటి వివాదాస్పద బిల్లును తెరపైకి తేవడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి? ఆగస్టు 20న లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన ‘130వ రాజ్యాంగ సవరణ బిల్లు’ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చకు దారితీసింది. రాజకీయాలను ప్రక్షాళన చేసే బ్రహ్మాస్త్రమా..? లేక విపక్షాలను ఇరుకున పెట్టే పదునైన వ్యూహమా..? దీని వెనుక ఉన్న అసలు కథేంటో లోతుగా తెలుసుకుందాం..!

- Advertisement -

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగియడానికి ఒక్క రోజు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ, ఐదేళ్లకు మించి శిక్షపడే కేసుల్లో 30 రోజులకు పైగా జైల్లో ఉండే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించాలన్నది ఈ బిల్లులోని కీలక ప్రతిపాదన. అయితే, దోషిగా తేలకముందే కేవలం అభియోగాల ఆధారంగానే పదవి నుంచి తొలగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమనే వాదనలు వినిపిస్తున్నాయి.

బిల్లులోని కీలక అంశాలు ఇవే..
రాజ్యాంగ సవరణ లక్ష్యం: రాజ్యాంగంలోని ఆర్టికల్ 75, 164, 239ఏఏలకు సవరణలు చేయడం ద్వారా ప్రధాని, సీఎంలు, మంత్రుల తొలగింపునకు మార్గం సుగమం చేయాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.

తొలగింపునకు ప్రాతిపదిక: ఐదేళ్లకు మించి శిక్షపడే అవకాశం ఉన్న కేసులో నిందితుడిగా ఉండి, 30 రోజులకు మించి జ్యుడీషియల్ కస్టడీలో (జైల్లో) ఉంటే, సదరు నేత తన పదవిని కోల్పోతారు.

పునః నియామకం: అయితే, జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ అదే పదవిని చేపట్టేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తోంది.

ప్రభుత్వ వాదన: ప్రజాప్రతినిధులు ప్రజల నమ్మకానికి ప్రతీకగా నిలవాలని, తీవ్రమైన నేరారోపణలతో జైలుకు వెళ్లినప్పుడు వారు ఆ నమ్మకాన్ని కోల్పోతారని, ఇది రాజ్యాంగ నైతికతకు విరుద్ధమని బిల్లు ముసాయిదాలో పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు జైల్లో ఉన్నా పదవిని అంటిపెట్టుకుని ఉండటాన్ని బీజేపీ వర్గాలు ఉదాహరణగా చూపుతున్నాయి.

ఆమోదం అంత సులువా – అంతుచిక్కని అంకెలు : రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో మూడింట రెండొంతుల ప్రత్యేక మెజార్టీ అవసరం. ప్రస్తుత రాజకీయ సమీకరణాల ప్రకారం ఇది బీజేపీకి కత్తి మీద సాము వంటిదే.

లోక్‌సభ: (మొత్తం 542) కావాల్సిన మద్దతు 361 కాగా, ఎన్డీఏ బలం కేవలం 293.
రాజ్యసభ: (మొత్తం 239) కావాల్సిన మద్దతు 160 కాగా, ఎన్డీఏ బలం 132 మాత్రమే.

ఈ సంఖ్యాబలం లేదని తెలిసీ బీజేపీ ఈ బిల్లును ఎందుకు ముందుకు తెచ్చింది అనేదే అసలు ప్రశ్న. ఒకవేళ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి పార్లమెంటులో గట్టెక్కినా, దేశంలోని సగం రాష్ట్రాలు దీనిని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో న్యాయ సమీక్షను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు.

బీజేపీ అసలు వ్యూహం ఇదేనా : ప్రస్తుతం “ఓట్ల చోరీ” ఆరోపణలతో విపక్ష ‘ఇండియా’ కూటమి కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో, అసలు చర్చను పక్కదారి పట్టించి, విపక్షాలను ఆత్మరక్షణలో పడేసేందుకే బీజేపీ ఈ బిల్లును ఒక అస్త్రంగా ప్రయోగించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపడం ద్వారా, విపక్షాలు దీనిని వ్యతిరేకిస్తే… “విపక్షాలు నేరచరిత రాజకీయాలకు అండగా నిలుస్తున్నాయి” అని ప్రచారం చేసి, బిహార్ ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది బీజేపీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది.

విపక్షాల ఆగ్రహం : ఈ బిల్లు రాష్ట్రాల హక్కులను హరించే కుట్ర అని, కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలను, మంత్రులను వేధించేందుకే దీన్ని తీసుకొస్తున్నారని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు మండిపడుతున్నాయి. “ఇది నిరంకుశ పోలీస్ రాజ్యాన్ని తెచ్చే ప్రయత్నం” అని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా విమర్శించారు. మొత్తం మీద, ఈ బిల్లు చట్టంగా రూపాంతరం చెందుతుందా లేదా అన్నది పక్కన పెడితే, రాబోయే రోజుల్లో దేశ రాజకీయాలను మరింత వేడెక్కించడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad