Hamid Ansari Mahmud of Ghazni Controversy : భారత చరిత్రలో సోమనాథ్ ఆలయ విధ్వంసం అనగానే గుర్తొచ్చే పేరు గజనీ మహమ్మద్. అటువంటి వ్యక్తిని ‘విదేశీయుడు కాదు, భారతీయుడే’ అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వంటి అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి వ్యాఖ్యానించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వివాదానికి కేంద్ర బిందువు: అన్సారీ ఏమన్నారు : మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చరిత్ర పాఠ్యపుస్తకాల్లోని అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “లోడీలు, గజనీలు విదేశాల నుంచి వచ్చిన ఆక్రమణదారులు అని మనం చదువుకున్నాం. కానీ వాస్తవానికి వారంతా భారతీయ దోపిడీదారులే. వారు పొరుగు దేశం నుంచి రాలేదు. రాజకీయ కారణాల వల్ల వారు దేవాలయాలను కూల్చారని చెప్పడం మనకు సౌకర్యంగా ఉండొచ్చు, కానీ వారందరూ భారతీయులే” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా చరిత్రకారుల మధ్య, రాజకీయ వర్గాల్లో చిచ్చు రేపాయి.
బీజేపీ నిప్పులు: ‘సిక్ మైండ్సెట్’ అంటూ విమర్శలు : అన్సారీ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే బీజేపీ అగ్రనేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ జాతీయ ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ, విదేశీ ఆక్రమణదారుల పట్ల అన్సారీకి ఉన్న ఈ ‘ప్రేమ’ ఆయన వికృత మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని మండిపడ్డారు.
షెహజాద్ పూనావాలా మరింత ఘాటుగా స్పందిస్తూ, “కాంగ్రెస్ మరియు దాని మద్దతుదారులు ఎప్పుడూ హిందూ వ్యతిరేక శక్తులను, నిరంకుశ పాలకులుగా ఉన్న ఔరంగజేబు వంటి వారిని కీర్తిస్తారు. గజనీ భారతదేశాన్ని ముక్కలు చేసి, అపారమైన సంపదను దోచుకెళ్లిన విషయాన్ని అన్సారీ వైట్వాష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు” అని ఆరోపించారు.
రాజకీయ విమర్శల పరంపర:
ఆధునిక ముస్లిం లీగ్: బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారి కాంగ్రెస్ను ‘ఆధునిక ముస్లిం లీగ్’గా అభివర్ణించారు. మొఘల్ చక్రవర్తులు బాగ్దాద్ ఖలీఫా ప్రతినిధులుగా పాలించారని, వారిని భారతీయులుగా చిత్రించడం చారిత్రక తప్పిదమని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీకి సవాల్: అన్సారీ వ్యాఖ్యలతో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏకీభవిస్తారా? అని బీజేపీ నేత సీఆర్ కేశవన్ ప్రశ్నించారు. వేలాది మందిని పొట్టనబెట్టుకున్న గజనీని సమర్థించడం దేశ ప్రజలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

