Saturday, November 15, 2025
Homeనేషనల్IAS officer Aayushi Singh : ఐఏఎస్ అయిన ఆయుషి, కళ్లు లేకున్నా... కలలను గెలిచింది!

IAS officer Aayushi Singh : ఐఏఎస్ అయిన ఆయుషి, కళ్లు లేకున్నా… కలలను గెలిచింది!

IAS officer Aayushi Singh : “సర్వేంద్రియానాం నయనం ప్రధానం” – కానీ, ఆ కళ్లే లేకపోతే..? ప్రపంచమంతా చీకటేనా..? కాదు, సంకల్పమనే వెలుగు ఉంటే, అంధత్వాన్ని జయించి, ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించారు ఢిల్లీకి చెందిన ఆయుషి సింగ్. పుట్టుకతోనే అంధురాలైనా, ఆ లోపాన్ని లెక్కచేయకుండా, పట్టుదలతో సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులై, ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఆయుషి విజయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం.

- Advertisement -

అంధత్వం శాపం కాదు : పుట్టుకతోనే అంధత్వంతో జన్మించిన ఆయుషికి, ఆమె తల్లిదండ్రులే వెలుగు దీపాలయ్యారు. వైకల్యాన్ని చూసి జాలిపడలేదు, ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు.

నా పుట్టుకే ఒక సవాల్. కానీ, నా తల్లిదండ్రులు నన్ను జ్ఞాన దీపంగా మార్చి, నా జీవితంలోని చీకటిని తొలగించారు. ‘టీచర్‌గా కొందరికే చదువు చెప్పగలవు, ఐఏఎస్ అయితే విద్యా వ్యవస్థలోనే మార్పులు తేగలవు’ అని మా అమ్మ చెప్పిన మాటలే నాకు స్ఫూర్తినిచ్చాయి.”
– ఆయుషి సింగ్, ఐఏఎస్

ఉపాధ్యాయురాలి నుంచి ఐఏఎస్ అధికారిగా : ఆయుషి తన కెరీర్‌ను ఉపాధ్యాయురాలిగా ప్రారంభించారు. ఐఏఎస్‌కు ఎంపిక కాకముందు, ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పదేళ్ల పాటు టీచర్‌గా పనిచేశారు. విద్యార్థులకు కేవలం పాఠాలే కాకుండా, జీవిత పాఠాలను కూడా నేర్పి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. తల్లి ప్రోత్సాహంతో, సివిల్స్ పరీక్షలకు సిద్ధమై, 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని వసంత్ విహార్‌లో సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM)గా విధులు నిర్వర్తిస్తున్నారు.

దివ్యాంగుల గొంతుకగా :  ఐఏఎస్ అధికారిగా, ఆయుషి దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై తన గళాన్ని వినిపిస్తున్నారు.

ప్రభుత్వానికి విజ్ఞప్తి: “ప్రభుత్వం దివ్యాంగుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నా, వాటిలో ఇంకా లోపాలున్నాయి. ముఖ్యంగా విద్యా శాఖలో దివ్యాంగుల కోసం కేటాయించిన ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి,” అని ఆమె కోరారు.

అందుబాటులో లేని పుస్తకాలు: “చాలా పాఠ్య పుస్తకాలు, మెటీరియల్స్ అంధ విద్యార్థుల కోసం సాఫ్ట్ కాపీలలో (బ్రైలీ లిపిలో) అందుబాటులో లేవు. దీనివల్ల వారు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు,” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో కూడా పాల్గొన్న ఆయుషి, తన కథతో లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారు. “మనిషి సామర్థ్యాన్ని వైకల్యం ఎప్పటికీ అడ్డుకోలేదు,” అనే ఆమె మాటలు, అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనుకునే ప్రతి ఒక్కరిలో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad