Boat Accident in Uttarpradesh: విహారయాత్ర విషాదాంతమైంది. ఘోర పడవ ప్రమాదంలో పలువురు మృతి చెందడం ఆయా కుటుంబాల్లో తీరని శోకం నింపింది. ఉత్తరప్రదేశ్లో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది.
యూపీలో మథుర జిల్లా బృందావన్లో శుక్రవారం ఘోర పడవ ప్రమాదం సంభవించింది. యమునా నదిలో యాత్రికులతో వెళ్తున్న ఒక భారీ స్టీమర్ పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో సుమారు 10 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కాగా, పలువురు గల్లంతయ్యారు.
బృందావన్లోని కేసీ ఘాట్ సమీపంలో నదిపై ఉన్న తాత్కాలిక ఫ్లోటింగ్ వంతెనను పడవ బలంగా ఢీకొట్టడంతో నియంత్రణ కోల్పోయి బోల్తా కొట్టింది. ఈ పడవలో సుమారు 25 నుంచి 30 మందికి పైగా యాత్రికులు ఉన్నారు. వీరంతా పంజాబ్లోని లూథియానా నుంచి వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు.
Also Read: https://teluguprabha.net/career-news/telangana-inter-results-to-be-released-on-april-12th/
సమాచారం అందిన వెంటనే NDRF, SDRF బృందాలు, సుమారు 50 మంది స్థానిక ఈతగాళ్లు సంఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ప్రస్తుతానికి 22 మందిని సురక్షితంగా రక్షించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని జిల్లా మెజిస్ట్రేట్ చంద్ర ప్రకాష్ సింగ్ వెల్లడించారు.

