Brain-Eating Amoeba Claims 19 Lives in Kerala: కేరళ రాష్ట్రాన్ని ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’ గడగడలాడిస్తోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి కారణంగా రాష్ట్రంలో ఈ ఏడాది ఏకంగా 19 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. నెగ్లేరియా ఫౌలెరి అనే ఈ అమీబా సోకితే ప్రాణాలు దక్కడం దాదాపు అసాధ్యం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
గతంలో కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ కేసులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఒక్కొక్కటిగా బయటపడటం ఆందోళనను రెట్టింపు చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే 61 కేసులు నమోదు కాగా, 19 మంది మరణించారని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే మరణాల సంఖ్య రెట్టింపు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ALSO READ: Maoist Ceasefire: శాంతి మంత్రం పఠిస్తూనే రక్తపాతం.. 24 గంటల్లోనే మావోయిస్టుల ద్వంద్వ నీతి బట్టబయలు!
అసలెలా వ్యాపిస్తుంది?
ఈ అమీబా సాధారణంగా చెరువులు, సరస్సులు, కాలువలు వంటి నిల్వ ఉన్న వెచ్చని మంచినీటిలో నివసిస్తుంది. అటువంటి నీటిలో ఈత కొట్టినప్పుడు లేదా మునిగినప్పుడు, ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి నేరుగా మెదడుకు చేరుకుంటుంది. అక్కడ వేగంగా మెదడు కణజాలాన్ని నాశనం చేసి, తీవ్రమైన మెదడువాపుకు కారణమవుతుంది. అయితే, కలుషిత నీటిని తాగడం వల్ల ఈ వ్యాధి సోకదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
లక్షణాలు, ప్రమాదం:
దీని లక్షణాలు సాధారణ మెనింజైటిస్ను పోలి ఉంటాయి. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు వంటివి ప్రారంభ లక్షణాలు. వ్యాధి నిర్ధారణ ఆలస్యమయ్యే కొద్దీ ప్రాణాపాయం పెరుగుతుంది. అందుకే, నిల్వ నీటిలో స్నానం చేసిన తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రభుత్వం సూచిస్తోంది. ప్రజలు చెరువులు, కాలువల్లో స్నానాలకు దూరంగా ఉండాలని, తప్పనిసరి పరిస్థితుల్లో ముక్కుకు క్లిప్స్ పెట్టుకోవాలని హెచ్చరించింది. బావులు, నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరినేషన్తో శుభ్రపరచాలని ఆదేశాలు జారీ చేసింది.
ALSO READ: Election Commission New Rules: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇకపై ఈవీఎంలపై అభ్యర్థి కలర్ ఫోటో


