Lawrence Bishnoi gang: భారత్తో పాటు విదేశాల్లో హత్యలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడుతున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ను కెనడా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ మేరకు కెనడా ప్రజా భద్రతల శాఖ మంత్రి గ్యారీ ఆనందసంగరీ అధికారికంగా ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో లారెన్స్ బిష్ణోయ్ మరియు అతని ముఠాను దేశ క్రిమినల్ కోడ్ ప్రకారం ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చినట్లయింది.
కీలక అధికారాలు లభ్యం: కెనడా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మరిన్ని కీలక అధికారాలు లభించనున్నాయి. దేశంలో బిష్ణోయ్ ముఠాకు సంబంధించిన ఆస్తులు, నగదు, వాహనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ముఠా సభ్యుల నేరాలపై విచారణ జరపడానికి కెనడియన్ చట్ట సంస్థలకు మరిన్ని అధికారాలు లభిస్తాయి. ఇమిగ్రేషన్ అధికారులు అనుమానిత ముఠా సభ్యులను దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించవచ్చు.
స్థానికుల ఆందోళన, ఒత్తిడే కారణం: కెనడాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆగడాలు పెరుగుతుండటంపై స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బిష్ణోయ్ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కోరుతూ ఇటీవల కన్జర్వేటివ్ పార్టీ తరఫున ఎంపీ ఫ్రాంక్ కాపుటో ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కోరారు. బిష్ణోయ్ గ్యాంగ్ నేర సామ్రాజ్యం విస్తరించిందని ఆ దేశ ఎంపీ అన్నారు. కెనడా పౌరులను దోచుకోవడం, హత్య కేసుల్లో వీరి పాత్ర ఉందని ఎంపీ తన లేఖలో ఆరోపించారు.
భారత్-కెనడాల మధ్య మెరుగవుతున్న సంబంధాలు: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం అనేది భారత్-కెనడాల మధ్య మెరుగవుతున్న సంబంధాలకు సూచన అని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ చర్యతో దేశంలో ఉన్న గ్యాంగ్ల కార్యకలాపాలపై కెనడా ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది.


