Captain Shambhavi Pathak Died in plane Crash: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇవాళ ఉదయం విమాన ప్రమాదంలో మరణించడం మహారాష్ట్రలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్తో పాటు మరో ఐదురుగు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో యువ పైలట్ కెప్టెన్ శాంభవి పాఠక్ కూడా ఉండటం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఈ యువ అధికారిణి విధి నిర్వహణలోనే మృత్యువు ఒడిలోకి చేరడం ఏవియేషన్ వర్గాలను తీవ్రంగా కలచివేస్తోంది. ప్రతిభావంతురాలైన పైలట్ శాంభవి పాఠక్ చిన్న వయసులోనే ఎయిర్ఫోర్స్లో చేరి అంచలంచెలుగా ఎదిగారు. ఎయిర్ఫోర్స్ బాలభారతి స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆమె.. ముంబై యూనివర్సిటీ నుండి ఏరోనాటిక్స్, ఏవియేషన్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేశారు. న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీలో కఠినమైన శిక్షణ తీసుకుని కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందారు. 2022 నుంచి వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఫస్ట్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్త పైలట్లకు శిక్షణ ఇచ్చే అసిస్టెంట్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్గా కూడా ఆమె పనిచేశారు.
సీనియర్ పైలట్ సుమిత్ కపూర్ సైతం..
సీనియర్ పైలట్ సుమిత్ కపూర్ ప్రమాదంలో సమయంలో విమానంలోనే ఉన్నారు. దీంతో, ఆయన కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో విమానాన్ని పైలట్ ఇన్ కమాండ్గా కెప్టెన్ సుమిత్ కపూర్ నడిపించారు. ఆయనకు ఏకంగా 16,500 గంటల విమానం నడిపిన సుదీర్ఘ అనుభవం ఉంది. శాంభవి పాఠక్ ఆయనకు ఫస్ట్ ఆఫీసర్గా సహకరించారు. ఇంతటి అనుభవం ఉన్న పైలట్లు ఉన్నప్పటికీ, సాంకేతిక లోపం, వాతావరణ పరిస్థితుల వల్ల ఘోర ప్రమాదం సంభవించింది. దీంతో, వారు విమాన ప్రమాదం నుంచి బయటపడలేకపోయారు. వీఐపీలు ప్రయాణించే లియర్జెట్-45 వంటి అధునాతన విమానాలను నడపడంలో శిక్షణ పొందిన శాంభవి, తన కెరీర్లో అత్యున్నత స్థాయికి చేరుకుంటుందన్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం ఆమె కుటుంబ సభ్యులను, బంధు మిత్రులను శోకసముద్రంలో ముంచెత్తింది.

