CBI Takes Over Probe of Karur Stampede Tragedy: ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ సభలో జరిగిన కరూర్ తొక్కిసలాట కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చేపట్టింది. ఈ ఘటనలో 41 మంది దుర్మరణం పాలవగా, 60 మందికి పైగా గాయపడ్డారు.
గత నెల సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్, వెలుసామిపురం వద్ద జరిగిన టీవీకే బహిరంగ సభలో ఈ ఘోర విషాదం చోటు చేసుకుంది. నటుడు విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా జనం పోటెత్తడంతో ఈ తొక్కిసలాట జరిగింది.
ALSO READ: Children HIV-Positive: థలసేమియాతో బాధపడుతున్న 5 మంది చిన్నారులకు హెచ్ఐవీ పాజిటివ్
స్వతంత్ర విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం
ఈ కేసును స్వతంత్రంగా దర్యాప్తు చేయించాలని కోరుతూ తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది.
ఈ ఘటన యావత్ దేశ పౌరుల మనసుల్లో ఒక ముద్ర వేసిందని, పౌరుల ప్రాణాలకు సంబంధించిన ఈ విషయంలో, తమ వారిని కోల్పోయిన కుటుంబాల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం అత్యంత ముఖ్యమని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో రాజకీయ జోక్యం, అలాగే స్థానిక పోలీసు అధికారుల వ్యాఖ్యల కారణంగా దర్యాప్తు పారదర్శకంగా ఉంటుందనే నమ్మకం ప్రజల్లో సన్నగిల్లిందని కోర్టు అభిప్రాయపడింది.
పౌరులకు న్యాయం వ్యవస్థపై విశ్వాసం పునరుద్ధరించడానికి నిష్పాక్షికమైన, స్వతంత్ర దర్యాప్తు అవసరమని పేర్కొంటూ, కేసును తక్షణమే సీబీఐకి అప్పగించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
ALSO READ: Chhath Puja Begins: 36 గంటల నిర్జల దీక్ష.. అర్చకులు లేని ఆరాధన! ఛఠ్ పూజ మహాపర్వం ప్రారంభం!
సీబీఐ రంగంలోకి
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ, రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను తిరిగి నమోదు చేసి, స్థానిక కోర్టుకు సమాచారం అందించింది. ఇప్పటికే సీబీఐకి చెందిన ప్రత్యేక బృందం కరూర్, వెలుసామిపురం ప్రాంతాన్ని సందర్శించి దర్యాప్తును ప్రారంభించింది.
ఈ కేసు విచారణను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రాస్తోగి నేతృత్వంలో త్రిసభ్య పర్యవేక్షక కమిటీని కూడా ధర్మాసనం ఏర్పాటు చేసింది. కరూర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీవీకే పార్టీ ఇప్పటికే రూ. 20 లక్షల ఆర్థిక సహాయం అందించిన విషయం తెలిసిందే.


