CBSE 10th Result: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి ఫలితాలను నేడు విడుదల చేసింది. ఈ ఏడాది దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 93.70 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే (93.66%) ఈసారి ఉత్తీర్ణత శాతం స్వల్పంగా మెరుగుపడింది. వెబ్సైట్లతో పాటు విద్యార్థులకు వేగంగా ఫలితాలు అందించేందుకు బోర్డు పలు డిజిటల్ ప్లాట్ఫారమ్లను అందుబాటులోకి తెచ్చింది.
results.cbse.nic.in, cbse.gov.in అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చు. విద్యార్థులు తమ APAAR ID లేదా పాఠశాల అందించిన పిన్ (Pin) ద్వారా లాగిన్ అయి డిజిటల్ మార్క్షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్మార్ట్ఫోన్లలో ఉమాంగ్ యాప్ ద్వారా కూడా ఫలితాలను నేరుగా పొందవచ్చు. ఇంటర్నెట్ సౌకర్యం లేని వారు ఎస్ఎంఎస్, ఫోన్ కాల్ (IVRS) ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. అదే విధంగా విద్యార్ధులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. గత ఏడాది10వ, 12వ తరగతి ఫలితాలు రెండూ ఒకేసారి మే 13న ప్రకటించారు. అయితే మే 15న 10వ తరగతి బోర్డు పరీక్షల రెండవ సెషన్ ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే 12వ తరగతి ఫలితాల కంటే ముందే 10వ తరగతి ఫలితాలను సీబీఎస్సీ బోర్డు వెల్లడించింది. విద్యార్థులు గరిష్టంగా మూడు సబ్జెక్టులలో తమ స్కోర్లను మెరుగుపరుచుకునేందుకు వీలుగా సీబీఎస్ఈ ఈ ఏడాది రెండు సార్లు బోర్డు పరీక్షలు రాసే విధానాన్ని ప్రవేశపెట్టింది.
అలాగే ఈ ఏడాది నుంచి 10వ తరగతిలో ఒకటి లేదా రెండు మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపే విధానం కూడా తీసుకువచ్చారు. అయితే పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అభ్యర్థులు మొత్తం మీద కనీసం 33 శాతం మార్కులు పొందాలి. అప్పుడే గ్రేస్ మార్కులు కలిపిందుకు వీలుంటుంది. ఇక 12వ తరగతి పరీక్షలు 2026 కూడా ఫిబ్రవరి 17వ తేదీ నుంచే ప్రారంభమయ్యాయి. 12వ తరగతి పరీక్షలు 2026 ఏప్రిల్ 10న ముగిశాయి. ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో ముగిసిన మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ భేటి

