ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నివాసమున్న ‘శీష్ మహల్'(Sheesh Mahal) అవినీతి ఆరోపణపై విచారణకు కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా పునరుద్ధరణకు ఆప్ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై సమగ్ర నివేదిక అందించాలని కేంద్ర ప్రజాపనుల విభాగం (CPWD)ని ఆదేశించింది. కాగా ఈ బంగ్లాకు పక్కనున్న నాలుగు ప్రభుత్వ ఆస్తులను చట్టవిరుద్ధంగా విలీనం చేసి విలాసవంతమైన శీష్మహల్ను విస్తరించారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఆరోపించారు. ఆ ఆస్తుల విలీనాన్ని రద్దు చేయాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశారు.
కాగా ఢిల్లీలోని 6 ఫ్లాగ్ స్టాఫ్ రోడ్లో ఉన్న ప్రభుత్వ బంగ్లాను కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో అధికారిక నివాసంగా వినియోగించారు. శీష్ మహల్లో రూ.96 లక్షల విలువైన మెయిన్ షీర్ కర్టెన్లు, రూ.39 లక్షల విలువైన కిచెన్ ఎక్విప్మెంట్, రూ.4.80 లక్షల విలువైన మినీబార్, రూ.16.27 లక్షల విలువైన సిల్క్ కార్పెట్లు కనిపించాయి. దీంతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కేజ్రీవాల్ విలాసాలు అనుభిస్తున్నారనే ఆరోపణలను బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఈ అవినీతి ఆరోపణలు ఎన్నికల్లో ఆప్ను ఘోరంగా దెబ్బతీసింది. అయితే ఇప్పుడు ఆ బంగ్లాలో ఢిల్లీ కాబోయే సీఎం నివాసం ఉండరని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది.